Minister KTR | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ( TSPSC ) పేపర్ లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి( Rajashekar Reddy ) వెనుకాల ఎవరున్నా వదిలిపెట్టం.. చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) తేల్చిచెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశంపై బీఆర్కే భవన్( BRK Bhavan )లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రాజశేఖర్ రెడ్డి బీజేపీ పార్టీ( BJP Party ) క్రియాశీలక కార్యకర్త. ఆయన వెనుకాల ఎవరైనా ఉన్నారా..? ఏదైనా కుట్రకోణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేయాలని డీజీపీ( DGP )ని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు. నేను నిరాధారంగా మాట్లాడటం లేదు. బీజేపీ కార్యకలాపాల్లో రాజశేఖర్ రెడ్డి పాల్గొంటున్నారు. బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అలాంటి వ్యక్తి దీని వెనుకాల ఉన్నాడంటే మాకు అనుమానం ఉంది అని కేటీఆర్ తెలిపారు.
ఇలా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ పోతుంటే దాన్ని కుట్ర అని బండి సంజయ్ అన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చి మా దగ్గరికి రాకుండా కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ గతంలో వ్యాఖ్యానించారు అని కేటీఆర్ గుర్తు చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వడం, పిల్లలకు ఉద్యోగాలు కల్పించడం కుట్ర అని మాట్లాడుతున్న సంజయ్ పార్టీకి చెందిన వ్యక్తే ఏ2గా దొరికాడు. దీని వెనుకాల ఏదైనా కుట్ర కోణం ఉందా? ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందా..? అప్రతిష్టపాలు చేయాలనే కుట్ర ఏమైనా ఉందా..? అనే అంశాలపై విచారణ జరిపించాలని డీజీపీని కోరుతున్నాం. పేపర్ లీక్ వెనుకాల ఎవరున్నా బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. వెయ్యికి వెయ్యికి శాతం వందకు వంద శాతం తప్పకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
పిల్లల జీవితాలో ఆడుకోవద్దు అని ఆయా రాజకీయ పార్టీలకు కేటీఆర్ సూచించారు. రాజకీయాల్లో విజయాలు, ఓటములు సర్వసాధారణం. కానీ మీ ప్రయోజనాల కోసం, ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు. ఇది మంచిది కాదు. ఆరేడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. మంచి ఏదో, చెడు ఏదో ప్రజలకు తెలుసు. మీ వ్యాఖ్యానాల వల్ల సున్నిత మనస్కులైన పిల్లలను ఇబ్బంది పెట్టొద్దు అని కేటీఆర్ సూచించారు.