CM KCR | 103 రోజుల్లో నాలుగుసార్లు మహారాష్ట్రలో పర్యటించిన సీఎం కేసీఆర్.. మూడు సభలతో మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రవాసుల్లో రాజకీయ చైతన్యదీప్తిని వెలిగించారు. తెలంగాణ మాడల్ను ముందుపెట్టి గ్రామ గ్రామాన చర్చను లేవనెత్తారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిని మహారాష్ట్ర నలుదిశలకూ విస్తరించేందుకు కార్యాచరణ చేపట్టారు. సైద్ధాంతిక పునాదిపై సుశిక్షిత కార్యకర్తలను తయారు చేసే దిశగా 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజుల శిక్షణను శుక్రవారం నాందేడ్లో అధినేత కేసీఆర్ ప్రారంభించారు. 1500 మందికి పైగా నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఈ తరగతులకు హాజరయ్యారు.
మహారాష్ట్రలో ఉన్న అన్ని పార్టీలు ప్రజలను పాలించాయి. ప్రజలు సూర్యచంద్రులు కావాలని అడిగారా? తినేందుకు బంగారం కావాలని అడిగారా? కనీసం తాగేందుకు నీళ్లు అడుగుతున్నారు? రైతులు తమ పొలాలకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు. ఎందుకు ఇవ్వరు?
– సీఎం కేసీఆర్
(నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): హలం పట్టిన రైతు అసెంబ్లీలో అడుగుపెట్టి తన రాతను తానే మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇంతకాలం ఎవరికో ఓటు వేసిన రైతు.. ఇప్పుడు తన ఓటును తానే వేసుకోవాలని కోరారు. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, సమన్వయకర్తలకు నాందేడ్లో శిక్షణా కార్యక్రమాలను కేసీఆర్ శుక్రవారం ప్రారంభించారు. రెండు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాల్ల్లో పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపటం కోసం ముందుకేసిన అడుగు వెనక్కి పడొద్దు. తడబడని అడుగులతో ప్రస్తుత పాలకుల తప్పులను ఎత్తిచూపాలి. మన ప్రతీ చర్య ప్రజల్లోకి వెళ్లాలి.
భారతదేశం గుణాత్మక మార్పు చెందాలి. అదే నా లక్ష్యం. దేశ వికాసం, అన్ని వర్గాల సంక్షేమం అనే మహా లక్ష్యం మనది. చిల్లర మల్లర రాజకీయాలు మన లక్ష్యం కాదు. దురదృష్టవశాత్తు దేశంలో రాజకీయాలు లక్ష్యాన్ని మరచిపోయాయి. జాతి పేరుతో, మతం పేరుతో, కులం పేరుతో, ధర్మం పేరుతో రాజకీయాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో గెలిచేందుకు మందు పంచుడు, పైసలు పంచుడు, ఏం చేసైనా ఎన్నికల్లో గెలవటమే లక్ష్యంగా రాజకీయాలు తయారయ్యాయి. ఆఖరికి హత్యలు చేసైనా ఎన్నికలు గెలవాలనే దుర్మార్గం నెలకొన్నది. పవిత్ర లక్ష్యాన్ని పాతరేసి అపవిత్ర విన్యాసాలు ఎక్కువయ్యాయి. మనసుపెట్టి ఆలోచించండి. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశ భవిష్యత్తును పాలకులు చీకట్లోకి విసిరేశారు. అందుకే ఇటువంటి విపరిణామాలను మనం చూస్తున్నాం. మన లక్ష్యం పవిత్రమైనది. ఆ లక్ష్యం సంపూర్ణమయ్యేదాకా విడిచిపెట్టొద్దు. రేపు నేనున్నా..లేకపోయినా ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి. నేను తమాషాకు కోసం బయలుదేరలేదు. చిల్లర రాజకీయాల కోసం ప్రయాణం ప్రారంభించలేదు. మన ప్రయా ణం తమాషా కోసం చేస్తున్నట్టు కొందరు అనుకొంటున్నరు. వాళ్లకు గట్టి సమాధానం చెప్పాలంటే అసలు మనకు ఉన్నదేంటి.. లేనిది ఏంటి అనేది తెలుసుకోవాలి.
మహారాష్ట్ర పశ్చిమ కనుమలు కృష్ణా, గోదావరి నదులకు జన్మనిచ్చాయి. వీటిని మహారాష్ట్ర చాలా తక్కువగా ఉపయోగిస్తున్నది. తాగునీటికి, సాగునీటికి ప్రజలు కష్టాలు పడుతున్నారు. మహారాష్ట్రలో పైఠన్ ప్రాజెక్టున్నది. దాని నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలే. పెద్దప్రాజెక్టులు ఎందుకు కట్టుకోలేకపోయాం? ఫలితంగానే అతివృష్టి, అనావృష్టితో రైతులకు కష్టాలు తప్పటం లేదు.ఎన్నికల్లో ఎవరికో ఒకరికి ఓటేస్తున్నం. 75 ఏండ్లుగా ఇదే జరుగుతున్నది. ఇది మార్చాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీ, పార్లమెంట్లో చట్టాలు, విధానాలు రూపొందుతాయి. అవి మన ప్రజలకు అనుకూలంగా ఉన్నాయా? లేవా? అనేది పాలకులు ఆలోచించరు. ఆ విధానాలు మనకు బాగాలేకపోతే మాత్రం మనం ఆందోళన చేస్తాం. నాసిక్ నుంచి ముంబై దాకా మన హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాలి. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం చల్లగా కూర్చుంటారు. మనం మాత్రం రోడ్ల మీద పోరాటాలు చేయాలా? రైతులు ఏటా పోరాటం చేయాల్సిందేనా? కనీస మద్దతు ధర కోసం రైతులు, కూలీ రేట్ల కోసం రైతు కూలీలు నిత్యం పోరాటాలు చేయాల్సిందేనా? మనసుపెట్టి ఆలోచిస్తే సమస్యల పరిష్కారం సులువే.
తెలంగాణలో ఒకనాడు మహారాష్ట్రకన్నా దయనీయ పరిస్థితులు ఉండేవి. రైతులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. ఇవ్వాళ తెలంగాణ అద్భుతంగా తనను తాను మార్చుకొన్నది. ధాన్యం దిగుబడిలో పంజాబ్ను దాటింది. తెలంగాణలో దాదాపు 3 కోట్ల టన్నుల కన్నా అధిక ధాన్యం పండుతున్నది. ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. 5 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నాం. ఇదేలా సాధ్యమైంది? వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసినం(ఇక్కడ తలాటీ వ్యవస్థ అంటరు). ఒకరి భూములు మరొకరికి ఇష్టారీతిగా మార్చే వ్యవస్థతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి పూర్తిగా రద్దుచేశాం.
రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజ్ చేశాం. రైతుబంధు ద్వారా అందించే సహాయాన్ని పొందేందుకు రైతులు ఎవరిదగ్గరికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశాం. రైతుబీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే ఎల్ఐసీకి చెల్లిస్తున్నది. రైతు ఎలా మరణించినా నామినీ ఖాతాల్లోకి ఆరేడు రోజుల్లోనే రూ.5 లక్షల బీమా సొమ్ము వచ్చేలా చూస్తున్నాం. ఇప్పటివరకు లక్ష మంది రైతు కుటుంబాలకు రూ.5 వేల కోట్లు చేరాయి. దేశంలో ఇది రికార్డు. ఇట్లా మహారాష్ట్రలో ఎందుకు చేయరు?
తెలంగాణ స్ఫూర్తితో మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ సర్కార్ రావాలి. తెలంగాణ ఏ లక్ష్యమైతే సాధించిందో.. అది మహారాష్ట్రలోనూ సాధించాలి. అందుకే మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ సర్కార్ రావాల్సిందే. రైతులు, రైతు కూలీలు, ఓబీసీ, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు.. ఇలా అన్ని పీడిత వర్గాల మేలు కోసం బీఆర్ఎస్ సర్కార్ రావాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో దళితబంధు ద్వారా ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నది. ఈ సొమ్మును తిరిగి చెల్లించాల్సిన అవసరంలేదు. ఇప్పటివరకు 50 వేల కుటుంబాలకు దళితబంధు సాయం అందింది. ఇందుకోసం రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పనిలేదు. హక్కును మనం సాధించేందుకు..మన ఓటును మనమే వేసుకొందాం అనే చైతన్యాన్ని ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది.
మహారాష్ట్రలో ఉన్న 36 శాతం రైతులు, వారితోపాటు రైతు కూలీలు, శ్రామికులు కలిస్తే 50 శాతం ఉంటారు. ఈ 50 శాతం ఓట్లు సరిపోవా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు? రైతులు ఎప్పటివరకు హలాన్ని బట్టి పొలాన్ని దున్నుతారు? నాగలి దున్నే రైతు.. కలం పట్టి చట్టాలు రూపొందించేలా తయారు కావాలి. ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో కూర్చుంటే నీ రాతను నువ్వే మార్చుకొంటావనే చైతన్యాన్ని రైతుల్లో కల్పించాలి. ఇదేం పెద్ద విషయం రాదు. రైతులు దరఖాస్తులు ఇవ్వటం కాదు..వాటిని తీసుకొనే స్థాయికి ఎదగాలి. అందుకే మన నినాదం ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’.
నాందేడ్లో బీఆర్ఎస్ సభ తరువాత మహారాష్ట్రలో ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. ‘మీరు అటూ ఇటూ పోకండి’ అని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు ప్రతి సంవత్సరం రూ.6 వేల సాయం అందిస్తామని ప్రకటించింది. తలాటీ (వీఆర్ఏ) వ్యవస్థ రద్దు చేసేందుకు ఆలోచిస్తామని నిన్నమొన్న వెల్లడించింది. అట్లనే తెలంగాణ మాడల్ బాగున్నది.. అటువంటి విధానాలు మహారాష్ట్రలో అమలు చేయటం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయని ఒక అధికారి కూడా చెప్పారు. ఇవి ఇన్నిరోజులు ఎందుకు చేయలేదు? ప్రభుత్వం ఎక్కడ పండుకున్నది? ఈ ప్రభుత్వం ఇంతకాలం ఎందుకు ఆలోచించలేదు? తక్కువ సమయంలో బీఆర్ఎస్ సాధించిన విజయాలను ప్రతీ ఇంటికి చేరేలా కార్యాచరణ ఉండాలి. అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తున్నది. అధినేత కేసీఆర్ 103 రోజుల్లోనే 3 సభలు, ఓ చిన్నపాటి సమావేశంతో ‘మహా’ రాజకీయాలను తన చుట్టూ తిరిగేలా చేశా రు. 288 నియోజకవర్గాల్లో తెలంగాణ మాడల్, కేసీఆర్ దార్శనిక విధానం పరివ్యాప్తమైంది. ‘మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులన్నా ముందే కేసీఆర్ చేరిపోయిం డ్రు’ అని మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే పేర్కొనటంలోని ఆంతర్యం అదేనని స్పష్టమవుతున్నది. నాందేడ్ సమావేశం మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది. దెబ్బ కు షిండే సర్కార్ దిగొచ్చి రైతులకు పీఎం కిసాన్ సమ్మా న్ నిధికి అదనంగా 6 వేలు చెల్లిస్తానని ప్రకటించింది. 103 రోజుల్లోనే రాష్ట్రమంతా వ్యాపించటం అసాధారణ విషయమని లాతూర్ జిల్లా ఔసాకు చెందిన సతీశ్షిండే అన్నారు. తెలంగాణ పథకాలు తమకూ కావాలన్న డిమాండ్ ముంబై దాకా పాకిందని సంతోష్ దొనకొండ చెప్పారు.
బీఆర్ఎస్ కార్యాలయం కోసం నాగపూర్లో భూమి కొన్నాం. ఔరంగాబాద్లో పార్టీ శాశ్వత కార్యాలయం కోసం స్థలాన్ని కొన్నాం. పుణె, ముంబైలోనూ బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయాలు నెలకొల్పుతున్నాం. మనం ఎంచుకున్న లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించకూడదని. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా లక్ష్యం నుంచి మనం పక్కకు తప్పుకోం. ఎత్తిన పిడికిళ్లు దించం. (దేశ్ కీ నేతా కైసే హో.. కేసీఆర్ కీ జైసే హో.. కేసీఆర్ ఆగే బడో.. హమ్ తుమ్హారే సాత్ హై అంటూ పెద్ద పెట్టున నినాదాలు). మీకు అందించిన ప్రచార సామగ్రి భగవద్గీత కావాలి. అది రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లాలి. మన నినాదంలోని ఆర్తి, ధర్మాగ్రహం, కర్తవ్యం అన్నీ ఇందులోనే ఉన్నాయి. కనుక దీన్ని ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి. ఇక్కడ ప్రదీప్ సోలంకీ మంచి వక్త, మరాఠీలో అద్భుతంగా పాటలు పాడుతారు. ఆయన లాంటివాళ్లు మరికొంతమంది ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఎంతోమందిని అద్భుతమైన వక్తలుగా తీర్చిదిద్దుతారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.