మహబూబ్నగర్ : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అధునాతన వసతులు కల్పించి దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని హన్వాడ మండల కేంద్రంలో రూ. రూ 52.97 లక్షలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలను ముస్తాబు చేస్తున్నామని అన్నారు. రూ.7,289 కోట్ల నిధుల్ని కేటాయించారని తెలిపారు. నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నీచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించనుందని వెల్లడించారు.
శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంల ఏర్పాటు, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేసి ప్రభుత్వ విద్యా విధానం రూపురేఖలే మారనున్నాయని వివరించారు. హన్వాడ మండలంలో గతంలో ఉన్న బీసీ బాలికల గురుకులానికి అదనంగా మరో బీసీ బాలికల గురుకులాన్ని కేవలం 15 రోజుల్లో మంజూరు చేయించామని తెలిపారు. ఎస్సీ బాలికల గురుకులంతోపాటు కేజీవీబీ ఏర్పాటుతో బాలికల విద్యకు ముందడుగు పడిందని పేర్కొన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి హన్వాడ మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి తెలిపారు. మండల కేంద్రంలో రూ.25 లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్, రూ. 60లక్షలతో నిర్మించిన రైతు బజార్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఆర్డీవో అనిల్ కుమార్, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయలక్ష్మి రమణారెడ్డి పాల్గొన్నారు.