హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దేశంలో ఆశా కార్యకర్తలకు అత్యధిక వేతనాలు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో చాలా తకువ వేతనాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆశా కార్యకర్తల రాష్ట్ర ప్రతినిధుల సభ జరిగింది. ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సభలో రాంబాబుయాదవ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చేనాటికి ఆశా కార్యకర్తలకు కేవలం రూ.3 వేలు మాత్రమే వేతనం ఉండేదని, నేడు 230 శాతం పెరిగి రూ.9,900కు చేరుకున్నదని వివరించారు.
పీఆర్సీలో ఆశాలను భాగం చేసిన ఘనత కేసీఆర్దేనని కొనియాడారు. మళ్లీ కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలని తెలంగాణ కార్మికవర్గం కోరుకుంటున్నదని, రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. కనీస వేతనం ఇవ్వాలని, అర్హతను బట్టి ఏఎన్ఎం పోస్టుకు అవకాశం కల్పించాలని ఆశా కార్యకర్తలు కొరుతున్నారని, ఈ సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు దృష్టి తీసుకెళ్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ సంతోష, బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు పీ నారాయణ, పీ మారయ్య, కరుణ, శ్రీదేవి, యాదమ్మ, స్వరూప, శోభ తదితరులు హాజయ్యారు.