న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని, అయితే ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సల్స్) నుంచి ప్రమాదం మాత్రం పొంచి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు భేదాభిప్రాయాలను పక్కన పెట్టి ముందుకు రావాలని ఆయన అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. వరుసగా 13వ సారి ఎర్రకోట నుంచి ఆయన జాతినుద్దేశించి శనివారం చేసిన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో.. అడవుల్లోని సాయుధ నక్సల్స్ను ఏరిపారేయడంలో తమ ప్రభుత్వం విజయవంతమైందని, అయితే దేశంలో ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారని, వారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని, సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి కుయుక్తులు పన్నుతున్నారని, దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. జన గణనలో యువత చురుగ్గా పాల్గొనాలని కోరారు. అభివృద్ధి చెందిన భారత దేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని కోరారు.
పోటీ పరీక్షలకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ కల్పిస్తామని, కోటి మంది యువతకు కృత్రిమ మేధలో శిక్షణ, క్రీడా ప్రతిభను వెలికితీసే కార్యక్రమం, చురుకైన పౌర రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. అలాగే తయారీ, అంతరిక్షం, న్యూక్లియర్ నుంచి సెమీ కండక్టర్ వరకు పలు రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. తన 75 నిమిషాల ప్రసంగంలో ఆయన 50 సార్లకు పైగా యువత గురించే ప్రస్తావించారు. 2014 నుంచి భారత దేశం సుమారు 40 దేశాలతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసిందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాయధ దళ బలాన్ని పెంచుకోవాని, అదే సమయంలో పౌరులను కూడా సిద్ధం చేయాలని మోదీ పేర్కొన్నారు.
Jagdambika Pal,పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆయన నిస్సహాయతకు స్పష్టమైన సంకేతమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. అంతకుముందు ఆయన విపక్షాలను అర్బన్ నక్సల్స్ అంటూ సంబోధించే వారని, ఇప్పుడు వారిని దిమాగీ నక్సల్స్’గా పిలుస్తున్నారని అన్నారు. మొత్తం రాజకీయ చరిత్రలోనే మోదీ అత్యంత దుర్భాషలాడే వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు. రాజకీయ శాస్త్రంలో దుర్భాషల మాస్టర్గా ఉన్న ప్రధానికి ఎంఏ డిగ్రీ ఉండటం యాదృచ్ఛికం కాదని ఎక్స్లో పేర్కొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు మూడేండ్ల క్రితం మోదీ.. విపక్షాలను అర్బన్ నక్సల్స్గా పేర్కొన్నారని, దాని అర్థమేమిటని తాము పార్లమెంట్లో ప్రశ్నించగా, దానికి ఎలాంటి అర్థం లేదని హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పారని తెలిపారు. ఇప్పుడు ఎర్రకోట సాక్షిగా దిమాగీ నక్సల్స్ అని మోదీ విమర్శలు చేశారని, అయితే నిజమేమిటంటే అర్బన్ నక్సల్స్ చేసిన కుల గణన లాంటి డిమాండ్లనే మోదీ అమలు చేస్తున్నారని అన్నారు.
లక్నో: ‘ఎర్రకోట నుంచి అబద్ధాలు మాట్లాడకూడదు.. అది అసత్యాలు చెప్పే ప్రదేశం కాదు’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు.ఈ బిల్లు 2023లోనే ఆమోదం పొందిన విషయాన్ని మరిచారా? అని ప్రశ్నించారు. మోదీకే కనుక చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఈ బిల్లు ఆమోదం పొందినందున 2027 యూపీ ఎన్నికల్లో దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దిమాగీ నక్సల్స్’ పదాన్ని ప్రధాని ప్రయోగించడాన్ని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తీవ్రంగా ఖండించారు.దేశంలోని దిమాగీ నక్సల్స్ను గుర్తించడానికి ప్రధాని దేశ పర్యటన చేయాలని జనశక్తి జనతా దళ్ వ్యవస్థాపకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి, మరో బీహార్ నేత చిరాగ్ పాశ్వాన్ సమర్థించారు. దేశంలోని అరాచక వ్యాప్తి, భారత ప్రగతిని విచ్ఛిన్నం చేయాలనుకునే వారిని గుర్తించాలన్న ఉద్దేశంతోనే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పంద్రాగస్టు ప్రసంగంలో ప్రదాని మోదీ మరోసారి కలలను అమ్మారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ విమర్శించారు. కేవలం ప్రశ్నించినంత మాత్రా న విద్యార్థులపై నక్సలైట్ ముద్ర వేస్తారా? అని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్.. మోదీని ప్రశ్నించారు.