న్యూఢిల్లీ: పసిఫిక్ మహాసముద్రంలో ఒక శక్తివంతమైన ఎల్ నినో ఘటన రూపుదిద్దుకోవడం కొనసాగుతున్నది. 2026 ద్వితీయార్థం, 2027 ప్రారంభంలో ఇది అత్యంత తీవ్రమైన వాతావరణ ఘటనగా మారడానికి 90 శాతానికి పైగా అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్(ఎన్వోఏఏ) నుంచి వచ్చిన తాజా అంచనా ప్రకారం.. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు గత నెలలో మరింతగా పెరిగాయి. ఇది ఎల్ నినో బలపడుతున్నదనడానికి ఒక ముఖ్యమైన సంకేతం. భూమధ్యరేఖ పసిఫిక్ ప్రాంతంలోని కొన్ని భాగాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఇప్పుడు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు నివేదించారు. వెచ్చని నీరు సముద్ర ఉపరితలం కింద లోతువరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే నెలల్లో వాతావరణ సరళి మరింత తీవ్రమవ్వడానికి దోహదపడనున్నది.
పసిఫిక్వ్యాప్తంగా వాతావరణ సరళులు ఇప్పటికే ఎల్ నినో ప్రభావానికి స్పష్టమైన సంకేతాలను చూపుతున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో వర్షపాతం పెరిగింది. అయితే ఇండోనేషియా వంటి ప్రాంతాలు సాధారణం కంటే పొడి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఎల్ నినో మరొక లక్షణమైన ఉష్ణమండల ప్రాంతాల్లో గాలుల తీరులో మార్పులు కూడా మరింత స్పష్టంగా మారాయి. ఎన్వోఏఏ, అంతర్జాతీయ అంచనా సంస్థలు ఉపయోగించే వాతావరణ నమూనాలు ఈ ఘటన 2026 చివరివరకు బలపడటం కొనసాగే అవకాశం ఉన్నదని సూచిస్తున్నాయి. 1950లో ఆధునిక పరిశీలనలు ప్రారంభమైనప్పటి నుంచి నమోదైన అత్యంత బలమైన ఎల్ నినోల్లో కొన్నింటితో పోటీపడే లేదా వాటిని మించిపోయేలా ప్రస్తుత ఎల్ నినో ఒక చారిత్రాత్మక ఘటనగా మారడానికి 69 శాతం అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేగనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సరళిపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన ప్రధాన ఎల్ నినో ఘట్టాల సరసన ఈ ఘటన నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణులు, ముఖ్యంగా ఎల్ నినో రుతుపవనాల వర్షపాతం, ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే దేశాల్లో, ఈ పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్లో తదుపరి సమాచారం వెలువడే అవకాశం ఉన్నది.