న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 15, (నమస్తే తెలంగాణ) : నల్సార్ లా యూనివర్సిటీ 2026 బ్యాచ్ మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలు తీవ్ర వివాదాస్పదం అయిన నేపథ్యంలో బీసీఐ చైర్మన్, బీజేపీ ఎంపీ మనన్ కుమార్ మిశ్రా శనివారం విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన విద్యార్థులకు లేఖ రాశారు. ‘యువ మిత్రులు నన్ను క్షమించాలి. నేను చేసిన వ్యాఖ్యల వల్ల గానీ.. తీసుకున్న చర్యల వల్ల గానీ మీ మనోభావాలు దెబ్బతింటే అందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరుతున్నాను. నేను క్షమాపణలు చెప్పడం అంటే నా అధికారానికి, మనోభావాలకు సంబంధించింది కాదు. యువత ఆకాంక్షలే ముఖ్యం అని తెలియజేయడం. విద్యార్థులు స్వేచ్ఛగా తమ నిరసనను తెలుపడం, భావాలను వ్యక్త పరచడం రాజ్యంగం ఇచ్చిన హక్కు. శాంతియుతంగా ఎలాంటి వాదనలు అయినా లేవనెత్తే హక్కు వారికి ఉన్నది. స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేలా లా విద్యార్థులు మెలగాలి’ అంటూ మనన్ కుమార్ చెప్పారు. అలాగే నల్సార్ వివాదంపై స్పందిస్తూ.. ‘ఎవరు స్నాతకోత్సవానికి హాజరు కావాలన్నది విద్యార్థులే స్వంతంగా నిర్ణయించుకోవాలి. ఎవరినీ బలవంతంగా హాజరు కావాలని గానీ.. లేదంటే రావొద్దని గానీ చెప్పకూడదు’ అని మనన్ వెల్లడించారు.
బీసీఐ ఆరోపణలు నిరాధారం: నల్సార్ స్టూడెంట్ బార్ కౌన్సిల్
తమపై అభ్యంతరకర వ్యాఖ్యలకుగాను బీసీఐ చైర్మన్ క్షమాపణలు చెప్పాలని నల్సార్ స్టూడెంట్ బార్ కౌన్సిల్ శనివారం డిమాండ్ చేసింది. విద్యార్థులు ‘గ్యాంగ్ రాజకీయం’ చేస్తున్నారని బీసీఐ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నల్సార్ విద్యార్థులు ఖండించారు. ప్రజాస్వామ్యంలో సీజేఐ విమర్శలకు అతీతం కాదని వారు స్పష్టం చేశారు. న్యాయ విద్యార్థులు న్యాయం కావాలని డిమాండ్ చేయకూడదా? అని వారు ప్రశ్నించారు. కర్ణాటక నేషనల్ లా సూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయు)కి చెందిన 702 మంది విద్యార్థులు మద్దతు తెలుపుతూ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.