హైదరాబాద్, మార్చి15 (నమస్తే తెలంగాణ)/నాగర్కర్నూల్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమమని, ముమ్మాటికీ ఇది అప్రజాస్వామికమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్తో లోపాయికారి ఒప్పందంతో ఆమెను అరెస్టు చేసిందని విమర్శించారు. కవిత అరెస్టును బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీనీ అడ్డు పెట్టుకొని కవితను అరెస్టు చేసిందని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, బీఎస్పీతో చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోదీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరతీశాడని ధ్వజమెత్తారు. ఈ చర్య తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదని తెలిపారు. దేశంలో మోదీ పాలన నాజీల నియంతృత్వంకన్నా ఘోరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. ప్రొఫెసర్ సాయిబాబా, సిసోడియా, ఇటీవల హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో? అని పేర్కొన్నారు. తెలంగాణ సమాజం కాదు.. యావత్తు దేశం బీజేపీని తక్షణమే తిరసరించాల్సిన అవసరమున్నదని కోరారు.
రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నీ ప్రమాదంలో ఉన్నాయని ప్రవీణ్కుమార్ అన్నా రు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బడేభాయ్.. చోటేభాయ్లా వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం నాగర్కర్నూల్లో నిర్వహించిన కాన్షీరాం 90వ జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ నాయకత్వంలో కేంద్రం దేశాన్ని పూర్తిగా దోచుకున్నదని, ఆస్తులను, సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనను ప్రశ్నించే వారిపై ఏసీబీ, ఈడీ దాడులు అంటూ వారి నోళ్లను మూయిస్తున్నారని మండిపడ్డారు.