హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి రామాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారు 650 ఎకరాల భూములు దురాక్రమణకు గురయ్యాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాచలం రామాలయం దేవస్థానానికి చెందిన 899 ఎకరాల భూములు ఉండగా.. అందులో సుమారు 650 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యల వల్లనే భూముల దురాక్రమణలకు ఆసారం కలిగిందని పేర్కొన్నారు. రాముని పేరిట రాజకీయాలు తప్ప భద్రాద్రి భూముల రక్షణలో బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. భద్రాచలం న్యాయవాదులు, పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో వినోద్కుమార్ను కలిసి భూము ల ఆక్రమణల గురించి వివరించారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. భద్రాద్రి రాముని భూము ల అన్యాక్రాంతానికి కేంద్ర ప్రభు త్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో బలవంతంగా, ఏకపక్షంగా విలీనం చేయడం వల్లనే భద్రాద్రి రాముని భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ భూములను కాపాడాలని ఏపీ రెవెన్యూ, ఎండోమెంట్స్, పోలీసు అధికారులకు భద్రాచలం దేవస్థానం ఈవో ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.
వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే భద్రాద్రి రాముని భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురి కాకుండా ఉన్న ఏడు మండలాలలోని గ్రామాలను తిరిగి తెలంగాణకు స్వాధీన పర్చాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పార్లమెంటులో చట్టం తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.