తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటీ జేఇఇ/నీట్ 2022 విజేతలకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రాస్, గోట్ అండ్ షీప్ కార్పొరేషన్ ఛైర్మెన్ బాలరాజు యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరంగా ఉన్న పేద విద్యార్థులు గురుకులాల వల్ల గొప్ప అవకాశం పొందుతున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందన్నారు. ఒకప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసిన ఆయన.. తెలంగాణ వచ్చిన తర్వాత గురుకులాలను సక్రమంగా నిర్వహించడం వల్ల అద్బుత ఫలితాలు వస్తున్నాయన్నారు. మొత్తం 5 లక్షల మంది దాకా గురుకులాల్లో చదువుతున్నారని చెప్పిన ఆయన ప్రతిభ చాటిన విద్యార్ధులను అభినందించారు. ఈ విషయంలో తెలంగాణ సర్కార్ దేశానికి రోల్ మోడల్ అవుతుందని చెప్పారు. ఈ ఏడాది ఐఐటీ, నీట్, జేఈఈలో 657 మంది గురుకులాల విద్యార్ధులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని, అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. విద్యార్ధులను ప్రోత్సహించిన సిబ్బందిని, తల్లిదండ్రులను కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు.
తను కూడా గురుకుల విద్యార్థులకు అభినందనలు తెలిపి, సత్కరించిన మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ గురుకులాలు అంటే ఒకప్పుడు పేదవాళ్లు చదివేది అనుకునే వారు, మామూలుగా చదివే వారు అనే మాట ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకుల విద్యార్థులు లక్షల ఖర్చుతో చదివే నారాయణ, చైతన్య విద్యాసంస్థల విద్యార్థులతో పోటీ పడి ర్యాంకులు సాధిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్ల, ప్రిన్సిపల్, టీచర్ల కృషి వల్ల ఇది సాధ్యమైంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 42 ర్యాంకులు మాత్రమే వస్తే, ఇప్పుడు ఆ సంఖ్య 1312కు పెరిగింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 134 గురుకుల కాలేజీలు ఉంటే ఈరోజు 268 గురుకులాలు ఉన్నాయి.
నాడు ఇంటర్ చదువు గురుకులాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండేది కాదు. పది చదువుకున్న తర్వాత పనులకు వెళ్ళేవారు. అందుకే సీఎం అన్ని గురుకులాలను, జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశారు. పేద విద్యార్థులకు డాక్టరు, ఇంజినీర్ అయ్యే అవకాశం కల్పించారు. పేద పిల్లల చదువుపై పెట్టుబడి కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగంగానే భావించారు. రోడ్లు, భవనాల ఏర్పాటు మాత్రమే కాదు, భావి తరాల పిల్లల చదువు కూడా అతి ముఖ్యమని భావించారు. రేపటి తరం మీద పెట్టే పెట్టుబడి, అద్బుత సంపదగా భావించారు. తెలంగాణ రాకముందు మొత్తం గురుకులాలు 290 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1000కి చేరువ అయ్యింది.
561 మంది ఐఐటీ, 750 మంది ఎంబీబీఎస్, బీడీఎస్ చదివే అవకాశం పొందారు. ఇంటర్ తర్వాత డిగ్రీ చేయడం అంటే ఒకప్పుడు ఎంతో కష్టం. ముఖ్యంగా మహిళలు ఎంతో ఇబ్బంది పడేవారు. దీనికి పరిష్కారంగా సీఎం కేసీఆర్ 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించారు. దేశంలో తొలిసారి రెసిడెన్షియల్ లా కాలేజీనీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. పీజీ కాలేజీలు కూడా ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వకపోయినా, గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ప్రారంభించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నాం.
ఒక పేద ఇంట్లో ఒక ఇంజినీర్, ఒక డాక్టర్ చదివే అవకాశం రావడం ఎంతో గొప్ప విషయం. వారి వల్ల ఆ కుటుంబం మాత్రమే కాదు, ఒక తరంలో మార్పు వస్తుంది. సీఎం కేసీఆర్ దీన్ని నమ్మారు కాబట్టే, విద్యార్థులకు చదువుకునే అద్బుత అవకాశాలు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం మీకు ఎంతో ఇచ్చింది. మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఇవ్వాలి. మీ ఊరుకో, మీ స్నేహితులకో, గురుకుల సొసైటీకో ఏదో విధంగా తిరిగి ఇవ్వాలి. మతాలు, కులాలు మధ్య చిచ్చు పెడితే ఏం వస్తుంది. ఆర్థిక, సామాజిక అంతరాలు లేని నవ సమాజం నిర్మాణం కావాలని సీఎం ఆకాంక్ష. అది విద్య వల్ల సాధ్యం అవుతుందని నమ్మారు. ఆచరిస్తున్నారు.
నేడు ఏ మండలం పోయినా ఒక గురుకులం ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత ఇది. అందులో చదువుకొని అత్యున్నత శిఖరాలు చేరే గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కార్పొరేట్ తరహా ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకువచ్చింది. దీనికోసం రూ.7000 కోట్లు ఖర్చు చేస్తున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వల్ల వెనుక బడ్డ వర్గాల పిల్లలకు అవకాశాలు లభించాయి. అత్యున్నత చదువులు చదివిన అంబేద్కర్ ఎలాగైతే దేశం కోసం ఇంగ్లాండ్ వదిలి వచ్చి రాజ్యాంగం రచించారో, అదే దారిలో నేటి విద్యార్థులు ఆలోచించాలి‘ అని చెప్పారు.