BJP | హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): బీజేపీలో రోజుకో వర్గం తెరమీదికి వస్తున్నది. ఇప్పటికే కిషన్రెడ్డి వర్గం, బండి సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అంటూ రాష్ట్ర నాయకత్వం చీలికలు పేలికలయ్యింది. ఒకరిపై ఒకరు ఢిల్లీలో ఫిర్యాదులు చేసుకుని, పదవులకు ఎసరు తెచ్చుకునే స్థాయికి విభేదాలు చేరిన సంగతి తెలిసిందే. పేరున్న నాయకులు పట్టుమని పదీఇరవై మంది లేకున్నా నేతలు నాలుగైదు వర్గాలుగా విడిపోవడంపై శ్రేణులు ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా బీజేవైఎంలోనూ గ్రూపు తగాదాలు బయటపడ్డాయి. గురువారం రాష్ట్ర బీజేపీ కార్యాలయం ముందే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ వర్గం, జాతీయ కోశాధికారి సాయిప్రతాప్ వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఇన్చార్జి తరుణ్చుగ్ ముందే రెండు గ్రూపులు బాహాబాహీకి దిగాయి. తరుణ్ చుగ్ చెప్పినా వినిపించుకోలేదు. దీంతో పార్టీ పరువు బజారున పడిందని నేతలు ఆవేదన వ్యక్తంచేశారు.
కొన్నాళ్లుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలను గమనించిన సీనియర్ నేతలు ఇదేం కొత్త పద్ధతంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూడు తరాల నేతలు అసంతృప్తిలో ఉండటం ఏమిటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రానురాను పార్టీ పరువును బజారున పడేస్తున్నారంటూ మండిపడుతున్నారు. సీనియర్లు తమకు గుర్తింపు లేదంటూ పార్టీ కార్యాలయంలో చర్చలు పెడితే.. ప్రస్తుత తరం నేతలు వర్గాలుగా విడిపోయి మీడియాకు ఎక్కి కొట్లాడుకుంటున్నారని, బీజేవైఎంలోని యువ నేతలు ఏకంగా రోడ్డుమీదే వాగ్వాదానికి దిగారని చర్చించుకుంటున్నారు. ఇలా రానురాను నేతలు పార్టీ పరువును మంటగలుపుతున్నారంటూ ఆరెన్సెస్ వాదులు, పాతతరం నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బీజేపీకి చెందిన పాత తరం నేతలు బయటికి వచ్చారు. అసెంబ్లీ టికెట్ల కేటాయింపులో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలంటూ కొత్త డిమాండ్ మొదలు పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్కు చెందిన దాదాపు 50 మంది నేతలు రెండు రోజులుగా వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఇందులో మల్లారెడ్డి, సుధాకర్శర్మ వంటి సీనియర్ నేతలు ఉన్నట్టు సమాచారం.
రెండు మూడు దశాబ్దాలుగా ఏమీ ఆశించకుండా పార్టీకి సేవలు అందిస్తున్నామని, పార్టీకి ఏమాత్రం గుర్తింపు లేని సమయంలోనూ తాము సేవచేశామని, ఇప్పుడు కాస్తో కూస్తో గుర్తింపు వచ్చిన తర్వాత తమను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు తగిన సంఖ్యలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అల్టిమేటం జారీ చేసినట్టు సమచారం. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులోనూ తమకు కనీసం పట్టించుకోవడం కూడా మానేస్తారని వాపోతున్నారు.