హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే, మనదేశంలో మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. మనదేశంలో ప్రభుత్వాలు ఎన్నికల కోసమే పనిచేస్తుండటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇతర దేశాల మాదిరిగా మనదగ్గర ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టిసారిస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (ఎన్హెచ్ఆర్డీ) 25వ వార్షిక సమావేశంలో భాగంగా గురువారం జరిగిన ‘డీకోడింగ్ ద ఎకనమిక్ ప్యూచర్’ సదస్సులో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ప్రపంచ పటంలో చిన్నగా కనిపించే జపాన్ అణుబాంబు దాడులకు గురైనా వెనుకడుగు వేయకుండా ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగిందని తెలిపారు. మనదేశంలో యువరక్తంతో కూడిన మానవ వనరులు 60 శాతానికిపైగా ఉన్నప్పటికీ.. చైనా, జపాన్, సింగపూర్లాంటి దేశాల కంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. మనదేశంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుందే తప్ప.. ఉద్యోగాలిచ్చే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఆలోచన చేయడం లేదని అన్నారు. శాంసంగ్, బీఎండబ్ల్యూ, ఎల్జీ లాంటి అంతర్జాతీయ బ్రాండ్లు అతిచిన్న దేశాల నుంచి వస్తున్నాయని, మనదేశంలో అలాంటివి ఎందుకు ఉత్పత్తి కావడం లేదని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. నిధుల కోసం అన్ని రాష్ర్టాలు ప్రతిపాదనలు పంపినా కేంద్ర బడ్జెట్లో ఒక్కపైసా ఇవ్వలేదని విమర్శించారు.
దేశాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కీలకపాత్ర పోషిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పారిశ్రామికం, మౌలిక వసతులు, విద్య, ఉద్యోగ, వైద్య రంగాలన్నింటిలో మిగితా రాష్ర్టాలకంటే తెలంగాణ ముందున్నదని తెలిపారు. దేశ జీడీపీలో 5 శాతం తెలంగాణ నుంచే వెళ్తున్నదని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్ అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నదని చెప్పారు. టీఎస్బీపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నామని గుర్తుచేశారు. అమెజాన్, గూగుల్, ఉబర్ లాంటి అంతర్జాతీయ కంపెనీలు అమెరికా తర్వాత హైదరాబాద్లోనే క్యాంపస్లు ఏర్పాటు చేశాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ 24 గంటల తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. సముద్రమట్టానికి దాదాపు 650 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని తెలిపారు.
ఆరోగ్య రంగంలో అనేక అద్భుతాలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడించిన కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా పనిచేసిందని తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్లను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందని చెప్పారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అత్యుత్తమ మౌలిక వసతుల ద్వారానే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటుచేస్తున్నామని గుర్తుచేశారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. కొత్తగా సూపర్ మల్టీ స్పెషాలిటీ దవాఖానలు నిర్మిస్తున్నామని తెలిపారు.
పారిశ్రామికాభివృద్ధికి అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ఎనిమిదేండ్లలో 7 లక్షల మంది విద్యార్థులకు టాస్క్లో శిక్షణ ఇచ్చామని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం గడిచిన 8 ఏండ్లలో హరితహారం ద్వారా 240 కోట్ల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిందని తెలిపారు. పారిశ్రామిక విధానాలకు సమర్థంగా అమలుచేస్తూనే, పర్యావరణానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిచ్చారని వివరించారు. గురువారం మొదలైన సదస్సులో అనేక రాష్ర్టాల నుంచి హెచ్ఆర్ ప్రతినిధులు హాజరయ్యారు. శుక్ర, శనివారాల్లో కూడా సెమినార్ కొనసాగుతుంది.