Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి రాష్ర్టాన్ని రుణాల ఊబిలో ముంచిందని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అధికారంలోకి వచ్చిన గత రెండు నెలల నుంచి తాను కూడా అప్పులు చేసే పనిలోనే నిమగ్నమైంది. తాజాగా శుక్రవారం మరో వెయ్యికోట్ల అప్పు చేయడంతో గత రెండు నెలల్లో రేవంత్ సర్కార్ చేసిన అప్పు రూ.6,400 కోట్లకు చేరింది.
దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది రాష్ర్టాలు బాండ్ల విక్రయం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.17,500 కోట్ల అప్పులు తీసుకున్నాయి. ఇందులో తెలంగాణ 22 సంవత్సరాల కాల పరిమితితో రూ.1,000 కోట్ల రుణం తీసుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ నెలలో 12వ తేదీన రూ.500 కోట్లు, 19వ తేదీన రూ.900 కోట్లు అప్పు తీసుకున్నది. అదేవిధంగా.. జనవరి 9వ తేదీన రూ.1000 కోట్లు, 16వ తేదీన రూ.2వేల కోట్లు, 30న రూ.1,000 కోట్లు అప్పు తెచ్చింది. ఇవి కాకుండా మరో మూడు నెలల్లో రూ.9 వేలకోట్లు రుణం తీసుకోనున్నది. తెలంగాణ తీసుకోనున్న రుణాల వివరాలను ఆర్బీఐ ఇటీవల విడుదల చేసింది.