Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): యాసంగి పంటలకు నీరు అందించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికారుల నోరు నొక్కేస్తున్నది. ఇరిగేషన్ శాఖలోని ఇంజినీర్లెవరూ నోరెత్తవద్దని, మీడియాతో ఎవరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేసింది. ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు తప్ప ఎవరూ ఎలాంటి సమాచారాన్నీ మీడియాకు ఇవ్వవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు పలువురు ఇంజినీర్లు చెప్తున్నారు. సాగునీటి యాజమాన్య నిర్వహణలో రేవంత్రెడ్డి సర్కారు వైఫల్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మరోవైపు ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్లో నీళ్లున్నా పంటలకు మళ్లించడం లేదని సూర్యాపేట పర్యటన సందర్భంగా గణాంకాలతో వివరించారు. దీంతో ఈ సమాచారాన్ని ఎవరు ఇస్తున్నారంటూ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులను నిలదీసినట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఎవరూ నోరెత్తవద్దని, మీడియాతో మాట్లాడవద్దని ఆంక్షలు విధించినట్టు ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి.