Minister Harish Rao | హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రచారం కోసం వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతారని, అభివృద్ధిలో, ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ఆ నీతులు చెప్పే నాయకులు వారు పాలించే రాష్ర్టాల్లో ఏమి పనిచేశారో నీతి ఆయోగ్ తేల్చి చెప్పిందని అన్నారు. నిలోఫర్లో సెంటర్ ఆప్ ఎక్స్లెన్స్ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆరోగ్యంలో రాజస్థాన్కు 16, ఛత్తీస్గఢ్ 10, హిమాచల్ ప్రదేశ్ 7వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఉత్తర ప్రదేశ్ చిట్టచివరన 28వ స్థానంలో నిలిచిందని చెప్పారు. అధమస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన నాయకులు కూడా తెలంగాణకు నీతులు చెప్తారని ఎద్దేవా చేశారు. ‘మాకు నీతులు చెప్పడం కాదు.. ముందు మీరు మా నుంచి నేర్చుకొని వెళ్లండి’ అని చురకలంటించారు.
ప్రపంచవ్యాప్తంగా పది దేశాల్లోనే ఎక్కువగా మాతాశిశు మరణాలు నమోదవుతున్నాయని, అందులో భారత్ అగ్రస్థానంలో ఉండడం సిగ్గుచేటని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నైజీరియా, కాంగో, పాకిస్తాన్, ఇథియోపియా, బంగ్లాదేశ్వంటి దేశాలతో భారత్ పోటీపడుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మన పరువు తీసిందని, ఆ దేశాల సరసన మన దేశం ఉండడం దారుణమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో దేశమంతా ఆరోగ్య రంగంలో అభివృద్ధి జరిగి ఉంటే.. నేడు అభివృద్ది చెందిన దేశాలతో భారత్ పోటీపడేదని తెలిపారు. మన దేశంలో తల్లీ బిడ్డల ఆరోగ్యానికి భరోసా ఇవ్వలేని నాయకులు.. రాజకీయాలు మాట్లాడుతారని ధ్వజమెత్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కేవలం తొమ్మిదేండ్లలోనే మాతా శిశుమరణాలను తగ్గించి రాష్ర్టాన్ని దేశానికే రోల్మాడల్గా మార్చామని చెప్పారు.
మరొకరికి జన్మనిచ్చే అమ్మకు, ఊపిరిపోసుకొనే బిడ్డ ఆరోగ్యాలకు అనేక పథకాలు, కార్యక్రమాల ద్వారా సీఎం కేసీఆర్ భరసా కల్పించారని తెలిపారు. మానవ సంపదే మహోన్నత సంపద అనే భావనతో సీఎం కేసీఆర్ పనిచేస్తే.. ప్రతిపక్ష నాయకులు ఓట్లు, సీట్లే పరమావధిగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజారోగ్యం గురించి తమ సర్కారు తపిస్తుంటే.. ప్రతిపక్షాలు అనారోగ్య రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగునీటి రంగం.. ఇలా ఏ రంగంలోనైనా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు తమతో పోటీపడాలని సవాల్ విసిరారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు అధమస్థానంలో ఉన్నాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో తమతో పోటీపడితే సంతోషిస్తామని, కానీ నీచ రాజకీయాలు, గోబెల్స్ ప్రచారాలు చేస్తే తిప్పికొడతామని హెచ్చరించారు.