హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మానవీయ ఆలోచనా విధానానికి ఈ బడ్జెట్ అద్దం పట్టిందని చెప్పారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సోషియో ఎకనమిక్ ఔట్లుక్-2023ని విడుదల చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా నిధులు భారీగా పెంచిందని చెప్పారు.
కొత్త ఉద్యోగస్థుల కోసం రూ.1000 కోట్లు
ప్రభుత్వం కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియను శరవేగంగా చేపట్టిందని, వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే 950 మంది కొత్త ఉద్యోగాల్లో చేరిపోయారని మంత్రి హరీశ్ చెప్పారు. కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అనుగుణంగా ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల కోసం రూ.1000 కోట్లను కేటాయించామని చెప్పారు.
ఏప్రిల్ 1 నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ 1 నుంచి క్రమబద్ధీకరిస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. అలాగే సెర్ప్ ఉద్యోగుల పేస్కేల్ రివిజన్ సైతం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు.
తళుకులీనే రోడ్ల కోసం
రహదారుల నిర్మాణానికి ఈసారి బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆర్అండ్బీ శాఖ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు, రూ.2,500 కోట్లు, అలాగే పంచాయతీరాజ్ శాఖకు రూ.2,000 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నిధులు ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు అదనమని వెల్లడించారు.
పంచాయతీలకు నేరుగా నిధులు
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రభుత్వం ఇచ్చే నిధులతోపాటు ఆర్థిక సంఘం నిధులను ఇక నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నగదుగా బదిలీ చేస్తామని మంత్రి హరీశ్రావు చెప్పారు. పల్లె ప్రగతికి రూ.3,360 కోట్లు, పట్టణప్రగతికి రూ.1,474 కోట్లు కేటాయించామని వివరించారు. అలాగే పట్టణప్రగతికి టీయూఎఫ్ఐడీసీకి అదనంగా రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించామని చెప్పారు.
సొంతజాగాలో ఇండ్ల నిర్మాణానికి రూ.12 వేల కోట్లు
సొంత స్థలాలున్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించామని మంత్రి హరీశ్ రావు వివరించారు. ఈసారి ఆర్అండ్బీ శాఖకు బడ్జెట్లో రూ.22,260 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి, ఆర్అండ్బీ శాఖ కేటాయింపులకు సంబంధంలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు.
అన్ని వర్గాలకూ అందలం
గత సంవత్సరం 9 జిల్లాలకే పరిమితం చేసిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని 33 జిల్లాకు విస్తరిస్తున్నామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. గొర్రెలు, మాంసాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.4,500 కోట్లు మంజూరయ్యాయని, అందుకే ఈ బడ్జెట్లో దీన్ని ప్రస్తావించలేదన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి గత బడ్జెట్లో ఈ పథకానికి రూ.2,750 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.3 210 కోట్లుకు పెంచామని తెలిపారు. అలాగే ఉచిత విద్యుత్తుకు ఇచ్చే సబ్సిడీని రూ.10,500 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెంచామని చెప్పారు. ఉచిత బియ్యం పథకానికి గతంలో రూ.2,786 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.3000 కోట్లు కేటాయించామని వివరించారు.
రైతురుణమాఫీకి రూ.6,385 కోట్లు
రైతురుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 6,385 కోట్లను కేటాయించిందని మంత్రి హరీశ్ చెప్పారు. రూ.90 వేల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేయనున్నామని తెలిపారు. అలాగే రైతుబంధు పథకానికి రూ.275 కోట్లు, రైతుబీమా కోసం రూ.193 కోట్లు గత బడ్జెట్ కంటే ఎక్కువగా కేటాయించామని మంత్రి చెప్పారు.
యూనివర్సిటీలకు రూ.500 కోట్లు
రాష్ట్రంలోని యూనివర్సిటీ హాస్టళ్లల్లో వసతులు మెరుగుపర్చటానికి ప్రభుత్వం రూ.500 కోట్లను కేటాయించిందని మంత్రి హరీశ్ చెప్పారు. ఈ మొత్తాన్ని గ్రాంటుగా ఇస్తామని పేర్కొన్నారు. అలాగే విద్యార్థుల డైట్, స్కాలర్షిప్స్ కోసం రూ.5,609 కోట్లు కేటాయించామనివెల్లడించారు.
ప్రగతికి దర్పణం సోషియో ఎకనమిక్ ఔట్లుక్
రాష్ట్ర ప్రగతికి సోషియో ఎకనమిక్ ఔట్లుక్ అద్దం పడుతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి దాకా వివిధ శాఖల సంపూర్ణ సమగ్ర, అధికారిక సమాచారంతో ఈ సోషియో ఎకనామిక్ ఔట్లుక్ను రూపొందించాం. రాష్ట్ర తలసరి ఆదాయం, జీఎస్డీపీ, ఆయా రంగాల్లో 2014 నుంచి 2022 వరకు స్థితిగతులు అన్నింటి సమాహారంగా దీన్ని రూపొందించాం.
– రామకృష్ణారావు, ఆర్థికశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి