Telangana | హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికరంగంలో స్తబ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే పారిశ్రామిక కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. భూ కేటాయింపుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు ప్రతిపాదనలపై కనీసం ఆలోచన చేసే నాథుడు కూడా లేడు. ప్రభుత్వం చెబుతున్న పారిశ్రామిక క్లస్టర్లపైనా స్పష్టత లేకపోవడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి అయోమయంగా మారింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పరిశ్రమల శాఖ డైరెక్టర్ డిప్యూటీ సీఎం వద్ద కార్యదర్శిగా చేరడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. నెల రోజుల తర్వాత ఆ ఖాళీని ఇటీవలే భర్తీచేశారు. అలాగే టీఎస్ఐఐసీ ఎండీని బదిలీచేసి శ్రీధర్కు అదనపు బాధ్యతలు కల్పించిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. వారం రోజులు తిరక్కుండానే తాజాగా ఆ బాధ్యతలను విష్ణువర్ధన్రెడ్డికి అప్పగించింది. దీంతో టీఎస్ఐఐసీ ఎండీ పోస్టులో కేవలం నెలరోజుల్లోనే ముగ్గురు మారారు.
మరోవైపు వివిధ పారిశ్రామికవాడల్లో భూములు కేటాయించాలని కోరుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి వచ్చిన వందల దరఖాస్తులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతి వారం సమావేశాలు నిర్వహించి ఆ దరఖాస్తులను క్లియర్ చేయాల్సిన అధికారులు.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకూ సమావేశాలు జరపరాదని నిర్ణయించారు. ఫలితంగా రుణాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పారిశ్రామిక క్లస్టర్లపై లేని స్పష్టత
పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ర్టాన్ని 3 క్లస్టర్లుగా విభజిస్తామని ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. ఫార్మాసిటీని రద్దుచేస్తామని ఒకసారి, రద్దు చేయడంలేదని మరోసారి చెప్పడం గమనార్హం. దీంతో ఫార్మాసిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన ఔత్సాహికులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ సర్కారు నిజంగానే కొత్త పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలనుకుంటే కేంద్రం నుంచి మళ్లీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
అది అనున్నంత సులభంకాదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. పర్యావరణ అనుమతులు లభించేందుకు కనీసం రెండు-మూడు ఏైండ్లెనా పడుతుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్న పారిశ్రామిక క్లస్టర్లపై ఉన్నతాధికారుల్లోనూ స్పష్టత లేదు. వాటి ఏర్పాటు కోసం ఏదైనా మాస్టర్ప్లాన్ రూపొందిస్తారా? లేక ప్రభుత్వ భూములను గుర్తించి వాటినే పరిశ్రమలకు కేటాయిస్తారా? ఆయా క్లస్టర్లను ఏ తరహా పరిశ్రమలకు ప్రత్యేకిస్తారు? వాటి విధివిధానాలు ఏమిటి? అనేది ఎవ్వరికీ అంతుబట్టడంలేదు.
హైదరాబాద్ నగరం నానాటికీ విస్తరిస్తుండటంతో ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్)కు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడంతోపాటు ఆయా పరిశ్రమలకు భూములను సైతం కేటాయించింది. తాజాగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో పరిశ్రమల తరలింపు ప్రక్రియకు కూడా బ్రేకులు పడ్డాయి.
అగమ్యగోచరంగా కొత్త పారిశ్రామికవాడలు
మరోవైపు టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 70 వరకూ కొత్త పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందుకోసం వివిధ జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుండగానే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెరగడంతో వాటిని ఇక్కడే ప్రాసెస్చేసి, ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఫుడ్ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
హైదరాబాద్ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో కనీసం 500 ఎకరాలకు తగ్గకుండా మొత్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. వీటిలో ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దాదాపు 1,400 దరఖాస్తులు రావడంతో పలు జిల్లాల్లో భూసేకరణ, కేటాయింపు కూడా పూర్తయింది. ఆయా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక పాలసీలను రూపొందించి, అమలు చేసింది. కానీ, ఆ పాలసీలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేక కొత్త విధానాలను ప్రవేశపెడుతుందా? అన్నది తెలియడం లేదు.