Staff Nurse | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): సీఎం రావాలి.. న్యాయం చేయాలి.. అంటూ రాష్ట్ర సచివాలయం ఎదుట నినాదాలు చేస్తూ సోమవారం స్టాఫ్ నర్సులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 317 జీవోను సమీక్షించాలి, హైకోర్టు తీర్పును అమలు చేయాలి, సీఎం రావాలి.. న్యాయం చేయాలి.. అన్న నినాదాలు ఆ ప్రాంతంలో హోరెత్తాయి. తాము సొంత జిల్లాలకు వెళ్లడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నది.
ఆలోగా మాకు న్యాయం చేసి జీవితాలను నిలబెట్టండి.. అంటూ వేడుకున్నారు. 317 జీవోను సమీక్షిస్తామని, బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు తమ సమస్యలను పరిష్కరించాలంటూ 317 జీవో ప్రభావిత స్టాఫ్ నర్సులు ధర్నా చేపట్టారు. ఆ సమయంలో సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బయట బాధితులు బైఠాయించడంతో గందరగోళం నెలకొన్నది. వారి ధర్నాతో సుమారు గంటసేపు సచివాలయం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 7,094 స్టాఫ్ నర్స్ పోస్టులకు బుధవారం నియామకపత్రాలు అందజేయనున్నది. ఈ నేపథ్యంలో బాధితులు సోమవారం సచివాలయానికి తరలివచ్చి నిరసనకు దిగారు. ‘మేము సొంత జిల్లాలకు వెళ్లాలంటే ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్నది. బుధవారం నియామకపత్రాలు ఇస్తే మా జిల్లాల్లోని ఖాళీలన్నీ భర్తీ అవుతాయి. అప్పుడు మాకు అవకాశం ఉండదు. మా కోసం సూపర్ న్యుమరరీ పోస్టులను సృష్టించే అవకాశమూ ఉండదు. మాకు ఇదే చివరి అవకాశం.
ప్రభుత్వమే న్యాయం చేయాలి’ అని బాధితులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే డీపీహెచ్ కార్యాలయం ఎదుట ధర్నా చేశామని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశామని.. అయినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. ఈ సందర్భంగా పోలీసులు సర్దిచెప్పినా ఆందోళనకారులు వినలేదు. తాము సీఎం రేవంత్రెడ్డిని కలిసే అవకాశం ఇవ్వాలని, లేదా సీఎంనే ఇక్కడికి రప్పించాలని వారు కోరారు. చివరికి ఐదుగురు సభ్యులను సీఎం వద్దకు తీసుకెళ్తామన్న పోలీసుల హామీతో ఆందోళనకారులు ధర్నా విరమించారు.
కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగుల విభజనకు గత ప్రభుత్వం ‘317 జీవో’ను విడుదల చేసింది. ఈ మేరకు అనేక మంది పట్టణాల నుంచి పల్లెలకు, ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన కొందరు జిల్లాలకు బదిలీ అయ్యారు. తమకు సొంత ప్రాంతంలో కాకుండా ఇతర జోన్లో పోస్టింగ్ ఇచ్చారని సుమారు 400 మంది స్టాఫ్నర్సులు గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడంతో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తున్నదని, తిరిగి పాత స్థానాలకు పంపించాలని కోరారు. హైకోర్టును సైతం ఆశ్రయించామని, తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని బాధితులు చెప్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ‘317 జీవోను సమీక్షిస్తాం’ అని హామీ ఇచ్చింది.