హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సుమారు 5 లక్షల మంది హజరుకానున్నారు. విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, నిఘా కోసం 144 ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష కొనసాగనున్నది. చివరి నిమిషంలో వచ్చే విద్యార్థుల కోసం ఐదు నిమిషాలు అదనపు సమయం కేటాయించనున్నారు. 9:35 గంటలకు గేట్లు మూసివేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 11,456 పాఠశాలలకు చెందిన 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 76.5 శాతం మంది ఇంగ్లిష్ మీడియం వారే కావడం విశేషం. తెలుగు, ఇంగ్లిష్తోపాటు ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ మీడియం విద్యార్థులు కూడా పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 34,500 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలను బిగించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని, ఆందోళన చెందకుండా ఉంటే పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొంటారని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం కొన్ని సలహలు, సూచనలు చేస్తున్నారు.
పాస్లు ఉన్న విద్యార్థులకే ఉచిత ప్రయాణం
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రూట్, రాయితీ, ఇతర బస్పాస్లు కలిగి, ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేయించుకోలేని పదో తరగతి విద్యార్థులకే బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించనుందని ఆర్టీసీ స్పష్టం చేసింది. పాస్లు ఉండి ఇతర రూట్లలోని కేంద్రాల్లో పరీక్షలు రాసే వారికీ ఈ సౌకర్యం వర్తిస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ఉచిత ప్రయాణం అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీ స్పందించింది. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ చర్యలు చేపట్టిందని, విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా బస్సు సర్వీసుల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు తెలిపారు. పాస్లు లేని విద్యార్థులు నగదు చెల్లించి టికెట్ కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.