శ్రీశైలం : మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ఉధృతి భారీగా పెరిగింది. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. గంట గంటకూ శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సుమారు 4 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో.. ప్రాజెక్టు 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పాల పొంగులా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. మల్లన్న సన్నిధి దాటుకొని.. సాగర్ చెంతకు వెళ్తుంది.
ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టు నుండి 1,73,946 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 26,741, సుంకేశుల నుండి 1,83,434, హంద్రీ నుండి 117 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి విడుదల కాగా సాయంత్రం వరకు 4,51,248 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,79,630 క్యూసెక్కులు, కుడి ఎడమ విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 62,484 క్యూసెక్కుల నీటిని సాగర్ రిజర్వాయర్కు విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఏంసీలు అని అధికారులు తెలిపారు.