బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా మారిన శ్రీశైలం డ్యామ్కు ప్రమాదం పొంచి ఉన్నది. స్పిల్ వే నుంచి భారీ వరద ప్రవాహం కారణంగా 40 మీటర్ల లోతులో ప్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడింది. ఇది మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నది. అంతేకాదు ఫౌండేషన్ గ్యాలరీ వద్ద కొన్ని డ్రైనేజీ రంధ్రాలు పనిచేయక ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నది. ఫలితంగా ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారింది. మరమ్మతులు చేపట్టాలని ఈ డ్యామ్ పరిస్థితిని పరిశీలించిన ఎన్డీఎస్ఏ రెండుసార్లు నివేదికలు ఇచ్చినా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది.
Srisailam | హైదరాబాద్, మార్చి8 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం డ్యామ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనున్నది. డ్యామ్ వద్ద ప్రమాదం తలెత్తే పరిస్థితులు నెలకొన్నా ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. నిపుణుల కమిటీల హెచ్చరికలనూ ఆ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో రానురాను డ్యామ్ మరింత డ్యామేజీకి గురవుతుందన్న ఆందోళన నెలకొన్నది. డ్యామ్పై ఏబీ పాండ్యా కమిటీ, ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల కమిటీ హెచ్చరికలు జారీ చేశాయి. ఏబీ పాండ్యా నేతృత్వంలోని కమిటీ 2021లోనే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్ల పరిస్థితిని పరిశీలించింది. డ్యామ్లపై నివేదికను సమర్పించింది.
శ్రీశైలం డ్యామ్ స్పిల్వే నుంచి వచ్చే భారీ ప్రవాహానికి 40 మీటర్ల లోతులో ప్లంజ్ఫూల్ గొయ్యి ఏర్పడిందని, ఈ నేపథ్యంలో స్పిల్వే దిగువన భద్రత పనులను వెంటనే చేపట్టాలని, స్కై జంప్ బకెట్కు మరమ్మతులు చేయాలని ఆదేశించింది. అందుకు రూ.800 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేసింది. అదేవిధంగా సాగర్ డ్యామ్లో స్పిల్వే మార్గాలపై కాంక్రీటు దెబ్బతిన్నదని, గ్యాలరీలోనూ కొన్ని సీపేజీ రంధ్రాలు, కుడికాలువ హెడ్ రెగ్యులేటరీ, గేట్లు, ఒక వర్టికల్ గేటుకు మరమ్మతు చేయాలని, అందుకు దాదాపు రూ.20 కోట్లు అవసరమవుతాయని ఆ కమిటీ నివేదించింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులు చేపట్టింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతు పనులను ఇప్పటికీ చేపట్టలేదు. నిర్వహణను గాలికొదిలేసింది.
నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యామ్ల భద్రత పరిశీలన కోసం ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం), కేఆర్ఎంబీ, ఇరు రాష్ర్టాలకు చెందిన అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ బృందం ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో శ్రీశైలం డ్యామ్ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టు నిర్వహణ తీరును చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎంతటి ప్రమాదకర పరిస్థితులో ఉన్నదో రెండుసార్లు తన నేవేదికల్లో ఆ కమిటీ వెల్లడించింది. తక్షణమే మరమ్మతు పనులను చేపట్టాలని సూచించింది. స్పిల్ వే దిగువన ప్లంజ్ఫూల్ మరింత లోతుకు, ఆనకట్ట పునాది వైపునకు విస్తరిస్తున్నదని, ఫలితంగా పునాది నిర్దేశిత గ్రేడ్ కంటే చాలా తకువకు పడిపోతున్నదని, దీంతో ఆనకట్ట స్థిరత్వం ప్రమాదకరంగా మారిందని హెచ్చరించింది.
ఫౌండేషన్ గ్యాలరీ వద్ద చాలావరకు డ్రైనేజీ రంధ్రాలు పనిచేయడం లేదని, ఇది ఆనకట్టపై ఒత్తిడిని పెంచుతున్నదని వెల్లడించింది. మరికొన్ని డ్రైనేజీ రంధ్రాలు గణనీయమైన ఒత్తిడితో ఫౌండేషన్ గ్యాలరీలో నీటిని విడుదల చేస్తున్నాయని, ఫౌండేషన్ గ్యాలరీ డ్రైనేజీ పైపుల నుంచి నీరు సురక్షితంగా వెళ్లేలా చేయాలని సూచించింది. పూడిన డ్రైనేజీ రంధాలను మరమ్మతు చేసి డ్యామ్ గ్యాలరీలో పారుతున్న నీటిని బయటకు వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా శ్రీశైలం డ్యామ్ చాలా ప్రమాదకరంగా మారిందని ఆ కమిటీ మరోసారి తేల్చిచెప్పింది. అయినా ఇప్పటివరకు ఏపీ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టనేలేదు. డ్యామ్ మరమ్మతు పనులకు పూనుకోలేదు.
శ్రీశైలం డ్యామ్ నిర్వహణను గాలికొదిలేసిన ఏపీ సర్కారు మరోవైపు నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు పనులు ముందుకు సాగకుండా కొర్రీలు పెడుతుండటం గమనార్హం. ఏబీ పాండ్య కమిటీ సిఫారసులతో గత బీఆర్ఎస్ సర్కార్ వెంటనే రూ.20 కోట్లతో నాగార్జునసాగర్ డ్యామ్ మరమ్మతు చర్యలు చేపట్టింది. అయితే ఏపీ సర్కారు అక్రమంగా డ్యామ్ను కుడివైపున 13వ గేట్ వరకు, కుడికాలువ రెగ్యులేటర్ను ఆక్రమించుకోవడంతో మరమ్మతు పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నదని ఎన్డీఎస్ఏ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. సాగర్ డ్యామ్ వద్ద ఉద్యోగుల కదలికపైనా పరిమితి కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపింది. మరోవైపు తమ భూభాగంలో ఉన్న సాగర్ డ్యామ్ నిర్మాణాలకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ పనులను తామే చేసుకుంటామని ఏపీ పట్టుబడుతుంది. ఇదే విషయమై ఇటీవల కేఆర్ఎంబీకి లేఖ రాయడం కొసమెరుపు. దీంతో సాగర్ డ్యామ్ పనులపైనా సైతం సందిగ్ధత నెలకొన్నది. ఈ కారణంగా సాగర్ భద్రత కూడా ప్రశ్నార్థకంగా మారిందని తెలుస్తున్నది.