హిమాయత్నగర్, ఆగస్టు 11: మాల సామాజికవర్గాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ మాలలకు పిలుపు ఇచ్చారు. మాలల ఓట్లతోనే గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తరువాత మాల కులస్తులకు వెన్నుపోటు పొడవడం సిగ్గు చేటని విమర్శించారు. మాలల హక్కుల కోసం 1997లో పోరాటం చేసి అసువులు బాసిన మాల మృతవీరుల సంస్మరణ సభ మంగళవారం హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీ రావు నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా 1997 ఆగస్టు 11న జరిగిన ఉద్యమంలో అమరులైన గోపతోటి నారాయణ, పాణంగి శేషయ్య, రెడ్డి సుదర్శన్ చేసిన త్యాగాలు మరువలేనివని గుర్తుచేసుకున్నారు. దేశంలోని బహుజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేయకుండా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. మాలల భవిష్యత్తును దెబ్బతిస్తూ అన్ని రంగాల్లో అణచివేసేందుకు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.