హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను నెలలోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన సమావేశ మినట్స్లో కేంద్ర జల్శక్తిశాఖ చాలా స్పష్టంగా పేర్కొన్నది. మినిట్స్ను ఇరు రాష్ర్టాలకు శుక్రవారం విడుదల చేసింది.
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అధికారులతో కేంద్ర జల్శక్తిశాఖ సెక్రటరీ దేబశ్రీ ముఖర్జీ ఢిల్లీలో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన మినిట్స్ను తాజాగా విడుదల చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్లతోపాటు, వాటికి సంబంధించి 15 ఔట్లెట్లను అప్పగించేందుకు ఇరు రాష్ర్టాలు అంగీకరించాయని జల్శక్తి శాఖ తెలిపింది. ఇకపై బోర్డు అనుమతి లేకుండా ఇరు రాష్ర్టాల అధికారులు, ఇంజినీర్లు ఎవరూ సాగర్డ్యామ్పై అడుగు కూడా పెట్టలేరు. ఇదిలా ఉంటే జల్శక్తిశాఖ మినట్స్కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయటం గమనార్హం.
తెలంగాణ నీటి హక్కులకు విఘాతం
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేఆర్ఎంబీ ఇప్పటికే రూపొందించిన ఆపరేషనల్ ప్రొటోకాల్ ఏపీకి వత్తాసు పలికేలా ఉన్నదని ఇంజినీర్లు, నీటిరంగ నిపుణులు అంటున్నారు. రివర్ బోర్డ్ల అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం విడుదల చేసి గెజిట్ అమలుపై గత ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్ల ఆపరేషనల్ ప్రొటోకాల్ను ఆ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి అనాడే తీవ్రంగా తప్పుబట్టింది.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డును, ప్లానింగ్ కమిషన్ నిబంధనల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ జలవిద్యుత్తు ప్రాజెక్టు మాత్రమేనని స్పష్టం చేసింది. నాగార్జునసాగర్కు ప్రత్యేకంగా ఎలాంటి క్యాచ్మెంట్ ఏరియా లేదని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మాత్రమే జల విద్యుత్తు ఉత్పత్తి ద్వారా మాత్రమే సాగర్ రిజర్వాయర్కు నీరు అందుతుందని, ఆ అంశాలను ఏవీ పట్టించుకోకుండా కేఆర్ఎంబీ ప్రొటోకాల్ రూపొందించిందని ఆ కమిటీ తప్పుపట్టింది.
మిగులు జలాలు, క్యారీ ఓవర్, తాగునీటి వినియోగం తదితర అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తిం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్ఎంసీ రూపొందించిన రిపోర్టును అంగీకరించే ప్రసక్తే లేదని గత బీఆర్ఎస్ సర్కారు తేల్చిచెప్పింది. కానీ నేడు ఆయా అంశాలపై ఎలాంటి స్పష్టత రాకుండానే ముందస్తుగా ప్రాజెక్టుల అప్పగింతకు కాంగ్రెస్ అంగీకారం తెలపడం గమనార్హం.
నికరజలాలను కోల్పోవాల్సిన ప్రమాదం
ఆపరేషనల్ ప్రొటోకాల్ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనలతో తెలంగాణ 45 టీఎంసీల నికర జలాలను కోల్పోవాల్సిన ప్రమాదం ఏర్పడింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్కు మళ్లిస్తే, నాగార్జునసాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్లోని రాష్ర్టాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీంఎంసీల చొప్పున కేటాయించారు.
ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టున ఎగువన మాత్రమే, అదీ ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ నొక్కిచెప్పింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ రాష్ర్టానికే దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. తెలంగాణ తన నీటి వాటా 45 టీఎంసీలతోపాటు, మైనర్ ఇరిగేషన్లో మిగులుతున్న మరో 45 టీఎంసీలను మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ప్రస్తుతం ఆపరేషనల్ ప్రొటోకాల్లో ఆ 45 టీఎంసీలను క్యారీఓవర్ కింద ప్రతిపాదించారు. అదే జరిగితే కేటాయించిన నికర జలాలను తెలంగాణ కోల్పోవాల్సి వస్తుందని నీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సహజ ప్రవాహాల ద్వారా కృష్ణా డెల్టాకు సాగునీటిని అందించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా నాగార్జునసాగర్ నుంచే 72.2 టీఎంసీలను కేటాయిస్తూ ప్రొటోకాల్లో రూల్ను పెట్టారు. ఇప్పటికే కేటాయింపులకు మించి 29 టీఎంసీలను డెల్టాకు మళ్లిస్తున్నారని కమిటీ నొక్కిచెప్పింది.
జలవిద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి చేసిన కరెంటును ఇరు రాష్ర్టాలు 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని ఆర్ఎంసీ ప్రతిపాదించింది. ఇదే జరిగితే తెలంగాణకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. గతంలో మాదిరిగా రాష్ట్ర అవసరాలు, డిమాండ్ మేరకు స్థాపిత సామర్థ్యం మేరకు జలవిద్యుత్తు ఉత్పత్తి చేపట్టే అవకాశం ఉండదు.
అప్పగింతకు ఇంకా ఒప్పుకోలేదు: మంత్రి ఉత్తమ్
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తామనడంలో ఏమాత్రం వాస్తవం లేదని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపిందని, తాము ఇంకా సమాధానం చెప్పలేదని తెలిపారు. సచివాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ ప్రాజెక్టుల అప్పగింత అంశంపై మాజీ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ప్రాజెక్టులను అప్పగిస్తామని కేంద్ర జల్శక్తిశాఖకు తెలంగాణ అధికారులు ఎలాంటి హామీ ఇవ్వలేదని, అయినా నెలరోజుల్లోగా అప్పగిస్తామని అంగీకరించినట్టు జల్శక్తిశాఖ వెల్లడించిందని విమర్శించారు. నీటి పంపకాల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్కు నివేదించాలని కోరామని చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై చర్చించి నిర్ణయిస్తామని, అభ్యంతరాలను కేంద్రానికి తెలుపుతామని, కేఆర్ఎంబీ విషయంలో అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
పదేండ్లలో రూ.7,500 కోట్లు ఖర్చు చేసినా సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఒక ఎకరాకు నీళ్లివ్వలేదని విమర్శించారు. రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి రూ.1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్ను రూ.22 వేలకోట్లకు పెంచారని ఆరోపించారు. రెండు మూడు రోజుల్లో సీతారామ సాగర్ ప్రాజెక్టును మంత్రులతో కలిసి సందర్శస్తామని చెప్పారు. సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఏపీని అడ్డుకునేదెలా?
బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం రిజర్వాయర్ ఎండీడీఎల్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అవార్డును ప్రకటించిన అనంతరం చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలను కేటాయించారు. మొత్తంగా 34 టీఎంసీలకే ఏపీకి అనుమతులు ఉన్నాయి. అయినప్పటికీ ఏపీ నిబంధనలకు విరుద్ధంగా పోతిరెడ్డిపాడును విస్తరించుకుంటూ పోతుండడమేగాకుండా, ఏటా బేసిన్ అవతలికి కృష్ణా జలాలను అక్రమంగా మళ్లిస్తున్నది.
శ్రీశైలం నుంచి 34 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునేందుకు ఏపీకి అనుమతివ్వాలని తెలంగాణ ఆది నుంచీ డిమాండ్ చేస్తున్నది. ఆ విషయాన్ని విస్మరించి ప్రాజెక్టు రూల్కర్వ్స్ను ప్రతిపాదించారు. ట్రిబ్యునల్ అవార్డును పట్టించుకోకుండా ఏడేండ్లలో జల వినియోగాల ఆధారంగా ప్రొటోకాల్ రూపొందించారు. ఆ ప్రొటోకాల్ ఇప్పుడు అమలైతే తెలంగాణ హక్కులకు తీవ్ర విఘాతం వాటిల్లినట్టే. భవిష్యత్లో సాగర్కు నీళ్లు వస్తాయా? అన్నది అనుమానమే. ఏపీని అడ్డుకునేదెలా అని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.
జల్శక్తి శాఖ మినిట్స్లోని అంశాలు