నిజామాబాద్ : అల్పపీడనం కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం శ్రీరాంసాగర్ (Sriramsagar Project) ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరు తరలివస్తుంది.
సుమారు 3 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందుజాగ్రత్తగా 30 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని గమనించి ఏ క్షణమైనా ప్రాజెక్టు గేట్లను ఎత్తివేస్తామని ముందస్తుగా దిగువన పరీవాహక ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేశారు. రెవెన్యూ, పోలీసులు ఇందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలెవ్వరూ కూడా పరీవాహక ప్రాంతాలకు రావద్దని, మత్స్యకార్మికులు, పశువుల కాపరులు, రైతులు గోదావరిని దాటే ప్రయత్నం చేయవద్దని అప్రమత్తం చేశారు.