హైదరాబాద్, ఆగస్టు 2: (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యుత్తు వ్యవస్థలో కీలకంగా మారిన టీజీ రెడ్కోకు అవినీతి చీడ అంటుకున్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంతమంది అక్రమార్కులు ఈ సంస్థను తమ అడ్డాగా మార్చుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రెడ్కో డివిజనల్ ఇంజినీర్ వెంకటరమణ ఇంట్లో బుధవారం ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణల్లో వెంకటరమణ ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. 2019లో సైబర్ సిటీ సర్కిల్లో డీఈగా పనిచేస్తున్న కాలంలో రూ.25వేలు లంచం పుచ్చుకుంటూ ఆయన ఏసీబీకి చిక్కారు. మళ్లీ ఉద్యోగంలో చేరిన తర్వాత రెండేండ్ల క్రితం టీజీ రెడ్కోకు డిప్యుటేషన్పై వచ్చారు. ఈయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రాగా, గురిపెట్టిన ఏసీబీ బుధవారం దాడులు చేసింది.
టీజీ రెడ్కో అధికారులు రాష్ట్రంలో అన్నదాతలను ముప్పుతిప్పలు పెట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. రైతుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు పలుమార్లు విమర్శలు చేశారు. ముఖ్యంగా పీఎం కుసుమ్ ప్లాంట్ల డీపీఆర్ల ఆమోదానికి రూ.2లక్షలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) కాంట్రాక్టర్లకు పనులు అప్పగించే విషయంలో, సోలార్ ప్లాంట్ల టెండర్ల ఖరారులోను కొందరు ముఠాగా ఏర్పడి చక్రం తిప్పారన్న ఆరోపణలున్నాయి.
బినామీ కంపెనీలకు టెండర్లు కట్టబెట్టడం, వారి పేరిట పనులు చేశారన్న అభియోగాలున్నాయి. కుసుమ్ ప్లాంట్ల సింక్రనైజింగ్కు రూ.10లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ ప్లాంట్లకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను బినామీ కంపెనీల నుంచి కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దక్షిణ డిస్కమ్లో పనిచేసే డీఈతో పాటు, మరో ముగ్గురు నలుగురు డివిజనల్ ఇంజినీర్లు కలిసి ఏకంగా ట్రాన్స్ఫార్మర్ల కంపెనీయే పెట్టినట్టు సమాచారం. సదరు కంపెనీ నుంచి ట్రాన్స్ఫార్మర్లను పీఎం కుసుమ్ రైతులకు అంటగట్టినట్టు తెలిసింది. దీనివెనుక భా రీ కుంభకోణం జరిగినట్టు సమాచారం.
రెడ్కో వీసీ, ఎండీ అనిలను కొంతకాలం క్రి తం ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. ఇటీవలి కాలంలో రెడ్కోకు ప్రాధాన్యం పెరిగిం ది. 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వ పాలసీని ప్రకటించడం, పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంతో రెడ్కో చేతికి పుష్కలంగా పని దొరికింది. ఇదిలా ఉంటే కలెక్టరేట్లు, సర్కార్ స్కూళ్లు, విద్యాసంస్థల కార్యాలయాలపై రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు పనులు ఈ సంస్థ చేపట్టింది. ఈ పనులను ఈపీసీ కాంట్రాక్టర్లకు అప్పగించే క్రమంలోనే లంచాలు పుచ్చుకుంటున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి.