కరీంనగర్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): పదేండ్లుగా పచ్చని పంటలతో అలరారిన శ్రీరాంసాగర్ ఆయకట్టు కాంగ్రెస్ పాలనలో కరువు కోరల్లో చిక్కుకున్నది. నిరుటి వరకు ఏ చీకూ చింత లేకుండా ఏడాదికి రెండు పంటలు తీసుకున్న రైతుల కండ్లల్లో ఇపుడు కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలో ప్రతి కాలువ కింద ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయి. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పాలకుల అవగాహనరాహిత్యానికి అధికారుల నిర్లక్ష్యంతోడవడంతో చేతికొచ్చిన పంటలు చేజారిపోయాయని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని డిస్ట్రీబ్యూటరీల పరిధిలో ‘ఎండని చేను లేదు.. ఏడ్వని రైతు లేడు’ అన్నచందంగా పరిస్థితి తయారైంది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో అన్ని డిస్ట్రిబ్యూటరీల పరిధిలో నీటిని విడుదల చేసేందుకు ప్రతి సీజన్లో నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళికలు చేస్తారు. ఈ యాసంగిలో కూడా ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి 2023 డిసెంబర్ 13న నీటి ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. ఆ సమయానికి ప్రాజెక్టులో 77.43 టీఎంసీల నీరు ఉంది. ఈ మేరకు దాదాపు 94 డిస్ట్రీబ్యూటరీలకు 64.18 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు.
నీటి విడుదల కోసం డీ1 నుంచి డీ 53 వరకు జోన్-1గా, డీ 54 నుంచి డీ94 వరకు జోన్-2 విభజించుకున్నారు. జోన్-1కు 3,500 క్యూసెక్కుల చొప్పున 7 రోజులు, జోన్-2కు 5,500 క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు సీజన్ మొత్తంలో 105 రోజులు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా జోన్-1 పరిధిలో నిరుడు డిసెంబర్ 18న, జోన్-2 పరిధిలో డిసెంబర్ 25న నీటిని విడుదల చేశారు. ఒక్కో జోన్కు 7 విడతల్లో నీటిని ఇచ్చారు. ఏప్రిల్ 6 వరకే నీటిని విడుదల చేయాలనేది అధికారుల ప్రణాళిక. అయితే ఈ ప్రణాళిక ఎక్కడా సరైన రీతిలో అమలు కాలేదని, అనుకున్న విధంగా నీటిని విడుదల చేయలేదని రైతులు వాపోతున్నారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రతి డిస్ట్రిబ్యూటరీ కింద వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్లు రాకనే తమకీ పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నారు. కాకతీయ ఎగువ కాలువకు జోన్-1కు 3,500 క్యూసెక్కులు, జోన్ 2కు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లయితే పూర్తి స్థాయిలో పంటలు చేతికి వచ్చేవని రైతులు అంటున్నారు. అయితే ఇచ్చిన నీటిపై అజమాయిషీ లేకపోవడంతో మొదటి డిస్ట్రిబ్యూటరీల రైతులే వాడుకున్నారని, చివరి ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. చివరి ఆయకట్టుకు నీళ్లు అందించేందుకు అధికారులు ఎంత మాత్రం ప్రయత్నించలేదని వారు వాపోతున్నారు. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు పశువులను మేపుకుంటున్నారు.
పోయిన ఏడాది లెక్కనే ఇప్పుడు ఉంటదని అనుకున్న. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీరు పుషలంగా ఉండేది. అదే ధీమాతో మా భూమితో పాటు కౌలుకు తీసుకొని వరి వేసిన. కానీ కాంగ్రెస్ సర్కారు వరద కాలువను అశ్రద్ధ చేయడంతో నీరు లేకుండా పోయింది. ఆరెకరాల పంట ఎండిపోయింది. కాళేశ్వరం కూలిపోయిందని కథలు చెప్పుకుంట పబ్బంగడుపుతున్నరు కానీ మా రైతుల గోస పట్టించుకుంట లేరు.
– గుగులోతు బన్సీ నాయక్, భూషణ్రావుపేట, కథలాపూర్ మండలం, జగిత్యాల జిల్లా