హన్వాడ, మే 1 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో రైతుల ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 15 రోజులైనా కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాలకు తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బులు అందేలా ప్రభుత్వం క్పషి చేయాలని కోరారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు, యారియా సకాలంలో అందించడం జరిగిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు.
మహబూబాబాద్ రూరల్, మే 1 : పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గోసపడుతున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్ గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.

రెండు వారాల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చినా కాంటా వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రోజుల తరబడి రైతులు పడిగాపులుకాస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యలు రాలేదని అన్నారు. సీఎం రేవంత్రెడ్డి రైతు బిడ్డ అయితే కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ అండగా ఉంటుందని తక్కళ్లపల్లి భరోసా ఇచ్చారు.