Botsa Satyanarayana | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 13: తెలంగాణ విద్యా వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోరు పారేసుకున్నారు. ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాల విడుదల సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దురహంకారం ప్రదర్శించారు. తెలంగాణ విద్యార్థులను అవమానించేలా మాట్లాడారు. ‘ఏపీ విద్యావిధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదు. అక్కడంతా చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది. మన ఆలోచనలు మనవి’ అంటూ నోటి దురుసు ప్రదర్శించారు. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి తన మంత్రవర్గం నుంచి బొత్స సత్యనారాయణను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. తెలంగాణ విద్యావ్యవస్థ గురించి బొత్స చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం ఆమె రంగారెడ్డి జిల్లా కందుకూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘ మీ రాష్ట్ర విద్యా వ్యవస్థ బాగుంటే, నాడు-నేడు కార్యక్రమం చేట్టిన తరువాత మీ విద్యాసంస్థల్లో లక్ష మంది విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది?’ అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని, ఏపీలో ఎంత ఖర్చు పెడుతున్నారని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1,050 గురుకులాలను ఏర్పాటు చేశామని, ఏపీలో ఎన్ని ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నారని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. తొమ్మిదేండ్లలో రెండుసార్లు ఉపాధ్యాయులను బదిలీ చేశామని, కొందరు టీచర్లు కోర్టుకు వెళ్లడం వల్ల బదిలీ ప్రక్రియ ఆగిందని గుర్తుచేశారు. మీ రాష్ర్టాన్ని మీరు పరిపాలించుకోవాలని, తెలంగాణ జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చురకలేశారు.
ఏపీ మంత్రి బొత్స మాటల వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ హస్తం లేకపోతే.. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. లేదంటే.. ఈ మాటల వెనుక జగన్ హస్తం ఉన్నట్టు భావించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. గురువారం ఆయన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తదితరులతో కలిసి కరీంగనర్లోని కేసీఆర్ రెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. నాడు కాంగ్రెస్ మంత్రిగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన బొత్స నేడు వైఎస్సార్సీపీ మంత్రిగా అదే వైఖరి ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ విద్యావ్యవస్థ దేశానికే అదర్శంగా నిలుస్తుంటే.. బొత్స వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన బొత్స అవగాహనారాహిత్యాన్ని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు.
ఉమ్మడి రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలిపి తెలంగాణలో 298 గురుకులాల మాత్రమే ఉండేవని, కేసీఆర్ పాలనలో వీటి సంఖ్య 1,009కి చేరిందని గుర్తుచేశారు. అప్పట్లో గురుకులాలల్లో 83 వేల మంది చదువుకొంటే.. ఇప్పుడు 6.75 లక్షల మంది చదువుకొంటున్నారని చెప్పారు. వసతి గృహాలతో కలుపుకుంటే 10 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి విద్యా సౌకర్యాలు ఏపీలో ఉన్నాయా? మీ గురుకులాల్లో చదువుతున్న 25 వేల మంది ఎక్కడ? మా వద్ద చదువుతున్న 6.75 లక్షల మంది ఎక్కడ? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అధునీకరిస్తున్న విషయం మీ కండ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పిన తరువాతే బొత్స సత్యనారాయణ హైదరాబాద్లో అడుగుపెట్టాలని హెచ్చరించారు.
తెలంగాణ విద్యా వ్యవస్థ, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని ఏపీ మంత్రి బొత్సకు పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సవాల్ విసిరారు. అభివృద్ధి పై చర్చకు బొత్స హైదరాబాద్ వస్తారా? విజయవాడ కనకదుర్గమ్మ లేదా తిరుపతికి రమ్మంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక అకసుతో ఆంధ్ర మంత్రులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ విద్యా వ్యవస్థను, విద్యార్థులను బొత్స తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. బొత్స పరీక్షల్లో కాపీలు కొట్టారే కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. ఏపీ రాజధాని ఏదని అడిగితే సమాధానం చెప్పలేనివారు తెలంగాణను విమర్శించడం సిగ్గుచేటని చురకలంటించారు.
నాడు ఏపీపీఎస్సీలో కుంభకోణాలు చేసిన చరిత్ర ఉన్నదని, డబ్బుల కట్టలతో లాడ్జ్లన్నీ నిండేవనీ నిప్పులుచెరిగారు. వోక్స్వాగన్లాంటి సాంలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని బొత్స భావిస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. నిబంధనలు పాటించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు నడిపిన ఇంజినీరింగ్ కాలేజీలకు తాళాలు వేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. బొత్స వ్యాఖ్యల వెనక ఏపీ సీఎం జగన్ ప్రమేయం లేకపోతే వెంటనే ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఏపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థుల మనోభావాలను, ప్రభుత్వ విధానాలను తూలనాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొనుపునూరి శ్రీకాంత్ హెచ్చరించారు. తెలంగాణను విమర్శించడం మాని ఏపీని ఎలా బాగుచేసుకోవాలో ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.
టీఎస్పీఎస్సీ పరిధిలో జరిగిన తప్పును గుర్తించి, దొంగలను పట్టుకున్నది తెలంగాణ ప్రభుత్వమేనన్న విషయాన్ని బొత్స గుర్తించాలని మంత్రి గుంగల కమలాకర్ చురకలేశారు. అక్రమాలు జరిగితే తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు. ఏపీలో ఉద్యోగాలను దొంగదారుల్లో అమ్ముకుంటున్నారని, అందులో ఏ ఒక్కరినైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. సమైక్య రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా పనిచేసిన సీతారామరాజు రూ.10 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ విషయాన్ని మరిచిపోయారా? అని నిలదీశారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణలో పూర్తి పారదర్శక విధానం కొనసాగుతుంటే ఏపీలో ఎమ్మెల్యేలు, బోర్డు సభ్యులు వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు అమ్ముకున్న సంస్కృతి బొత్సకు ఉన్నదని ఘా టు విమర్శలు చేశారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో సమైక్య ప్రభుత్వాల హయాంలో రూ.లక్ష నుంచి ఐదు లక్షలు వసూలు చేసింది నిజం కాదా? అని నిలదీశారు. ఇప్పుడు కూడా ఏపీలో ఒక్కో బదిలీకి లక్షకు పైగా వసూలు చేస్తున్నారని విమర్శించారు.
సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. హుస్నాబాద్ ప్రాంతంలో వరినాట్లు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఆంధ్రా కూలీలు తరలివచ్చారు. నిరుడు ఎకరాలో వరినాట్లు వేసేందుకు రూ.4,500 తీసుకోగా, ఈ ఏడాది రూ.5,500 తీసుకుంటున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నుంచి దాదాపు వంద మందికి పైగా కూలీలు గురువారం హుస్నాబాద్ శివారులో నాట్లు వేశారు.