Srinivas Goud | మహబూబ్నగర్ : గత రెండు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనే బెటర్ అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. నారాయణ పేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు ఎస్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.
ఆసరా లబ్దిదారులు, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సర్కార్ ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరం కలిసి మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు సమయానికి పడ్డాయని దాంతో రైతులు, ఆసరా లబ్దిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.