మహబూబ్నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇష్టానుసారంగా జలదోపిడీకి తెరలేపుతున్నాయి. పథకం ప్రకారం తుంగభద్ర నదిపై రెండు రాష్ర్టాలు ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాలువలు నిర్మిస్తున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర జలాలు అడుగుపెట్టకుండా నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయి. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి రాష్ట్ర జల హక్కులను కాలరాస్తున్నాయి. ఎక్కడికక్కడే నీటిని ఒడిసిపట్టి, చుక్కనీరు రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డకు న్యాయంగా రావాల్సిన నీటిని తరలించేందుకు అప్పట్లో రాజోళిబండ డైవర్షన్స్ స్కీమ్ (ఆర్డీఎస్) పేరుతో ఆనకట్ట నిర్మించగా.. నేడు ఏపీ, కర్ణాటక చేస్తున్న జల దోపిడీతో నడిగడ్డకు మరణ శాసనం రాస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఆర్డీఎస్ తూములను బద్దలుకొట్టి సుంకేసుల డ్యామ్కు నీళ్లు తీసుకెళ్తామని బెదిరిస్తే, నాడు కేసీఆర్ పాదయాత్ర చేసి వారి కుట్రలకు అడ్డుకట్ట వేశారు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆర్డీఎస్ ఆయకట్టు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తుంగభద్ర డ్యామ్కు ఇండెంట్లు పెట్టి కాలువకు నీరు పారించారు. ప్రస్తుతం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పొరుగు రాష్ర్టాలు తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు అంతులేకుండాపోయింది. అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బుధవారం ఆర్డీఎస్ను పరిశీలించింది. మాజీ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్కుమార్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తోపాటు నేతలు ఆంజనేయగౌడ్, బాసు హనుమంతునాయుడు తదితరులు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం నుంచి తరలివెళ్లి కర్ణాటకలోని మాన్వి తాలూకాలోని ఆర్డీఎస్ను సందర్శించారు.
ఆర్డీఎస్కు 100 అడుగుల దూరంలో..
ఆర్డీఎస్కు 100 అడుగుల దూరంలోనే కురిడి ఎత్తిపోతల పథకం పనులను కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి అనుమతుల్లేకుండానే రెండు టీఎంసీలను తరలించుకొనిపోయేలా నిర్మాణం చేపట్టింది. అక్కడ సాగుతున్న పనులను చూసి బీఆర్ఎస్ బృందం అవాక్కయ్యింది. అక్కడే ఉన్న తహసీల్దార్తో ఇది అక్రమ ఎత్తిపోతల పథకమని, ఎలా నిర్మిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. మరోవైపు ఆర్డీఎస్కు కుడి వైపున భారీ కాలువ తవ్వి మరో రెండు టీఎంసీలను తరలించేందుకు ఏకంగా హెడ్రెగ్యులేటరీ సిస్టంను ఏర్పాటు చేశారు. దీనికి పైభాగంలోని 15 కిలోమీటర్ల దూరంలో చిక్కల్ పరువు వద్ద మరో ఎత్తిపోతల పథకం కూడా రూపుదిద్దుకొంటున్నది. ఇటు ఆర్డీఎస్ దిగువన కర్ణాటక సర్కార్ భారీ రిజర్వాయర్కు రూపకల్పన చేస్తున్నదని అక్కడి రైతులు చెప్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే తుంగభద్ర నదిలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కకుండా పోతుంది. ఆర్డీఎస్ ఆయకట్టుతోపాటు దీని ఆధారంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కూడా నిష్ప్రయోజనంగా మారే అవకాశాలున్నాయి.
నడిగడ్డను ఎడారిగా మార్చే కుట్రలను అడ్డుకుంటామని తెలంగాణ సర్కార్ మొద్దు నిద్ర వీడుకుంటే ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. అనంతరం ఆర్డీఎస్ కుడి వైపు ఉన్న ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన కుడి కాలువ హెడ్ రెగ్యూలేటరీని సందర్శించారు. దీనిని కూడా ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్నదని, దీన్ని కూడా ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిద్రలేచి వెంటనే కర్ణాటకలోని అక్రమ ప్రాజెక్టులను నిలిపివేయించాలని, ఏపీ నిర్మించ తలపెట్టిన వాటిని కూడా అడ్డుకోవాలని సూచించారు. ఆర్డీఎస్ ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. కాగా, గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. సుమారు 15.9 టీఎంసీల నీటిని ఆర్డీఎస్కు వదిలేందుకు అప్పట్లో ఒప్పందం కుదరగా.. తుంగభద్ర బోర్డు కూడా అంగీకరించి నీటిని వదులుతున్నది. అయితే, ఆనకట్ట నిర్మించిన నాటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డకు ఏనాడూ పూర్తిస్థాయిలో నీళ్లు అందిన దాఖలాల్లేవు.
ముగ్గురు సీఎంలు కలిసి నష్టం చేస్తున్నారు: శ్రీనివాస్గౌడ్
వ్యవసాయంపై ఆధారపడిన మహబూబ్నగర్కు నీళ్లు రాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల ముఖ్యమంత్రులు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ లెఫ్ట్ కెనాల్కు నీరు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నడిగడ్డ ఒక్కటే కాదు ఉమ్మడి జిల్లాకు తీరని నష్టం జరుగుతుందని, నీళ్లు రాకుండా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోకుంటే చరిత్రహీనులుగా మిగిలి పోతారని హెచ్చరించారు. ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెడితే ఇక్కడి రైతులు, ప్రజలు తిరుగబడుతారని హెచ్చరించారు. ఆదిత్యానాథ్ దాస్ను మన నీటిని తీసుకొనిపోయేలా సలహాదారుగా నియమించారని ఎద్దేవా చేశారు. అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారా? లేదా? కాంగ్రెస్ మంత్రులు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ ప్రాజెక్ట్ను బద్దలుకొడుతామని, రైతులను కాపాడుకుంటామని తెలిపారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.