హైదరాబాద్, నమస్తే తెలంగాణ/నెట్వర్క్, జూలై22: స్థానికంగా కురుస్తున్న వర్షాలకు తోడు కర్నాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణా, తుంగభద్ర నదులు పోటెత్తుతున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం వరకు ప్రాజెక్టులకు ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి. శుక్రవారం సైతం శ్రీశైలం జలాశయానికి రెండు లక్షల క్యూసెక్కుల వరద కొనసాగింది.
మరో రెండు రోజులపాటు అదేస్థాయిలో వరద కొనసాగే అవకాశమున్నదని అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు రెండు క్రస్ట్గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. తుంగభద్ర ఎగువ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యాం గేట్లను మూసివేశారు.కాగా, గోదావరిలో వరద ప్రవాహం మళ్లీ స్వల్పంగా పెరిగింది. శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, పార్వతి, సర్వస్వతి బరాజ్కు వరద తగ్గగా.. మేడిగడ్డ, సమ్మక్క బరాజ్కు వరద కొనసాగుతున్నది.