ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలకు రామాలయాన్ని ముస్తాబు చేశారు. సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆల య అధికారులు, అర్చకులు మిథిలా స్టేడియంలో కల్యాణ వేదిక సిద్ధం చేశారు. గురువారం ఉదయం 9:30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్చారణల నడుమ మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. 10:30 గంటల నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు. సరిగ్గా మధ్యా హ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహూర్తాన కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నా రు. కల్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. కల్యాణ మహోత్సవం జరిగిన మర్నాడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా శుక్రవారం పన్నెండేండ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర మహాపట్టాభిషేకం జరుగనున్నది. సీతారామ కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ రూ.కోటి ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ నిధులతో ఆలయ అధికారులు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీస్శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు ఎస్పీ వినీత్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, 6 వేల మంది సిబ్బందితో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.