హైదరాబాద్ : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రభుత్వ వైద్య కళాశాల (Medical College) ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) , స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ , జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి , డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి , ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ గణపతి రెడ్డి, వై టి డి ఏ, వైస్ చైర్మన్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ (Laxmi Narasimha Temple) ఆలయ పరిసర ప్రాంతంలోని 20 ఎకరాల స్థలంలో అద్భుతంగా వైద్య కళాశాలను నిర్మించాలని నిర్ణయించారు. వైద్య కళాశాలతో రాబోయే కాలంలో భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అందుబాటులోకి కళాశాలను తీసుకురావాలని, కళాశాల పేరు కూడా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైద్య కళాశాలగా పేరును నిర్ణయించారు.
కళాశాల నిర్మాణానికి మూడు చోట్ల స్థలాలను గుర్తించగా తుది స్థలం ఎంపిక బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కు అప్పగించాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. సీఎం నిర్ణయం వెంటనే శంకుస్థాపన కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.