హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచంతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగం ఎదిగిందని, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. త్వరలోనే ముంబైని అధిగమిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు సభలో ‘రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతి’పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన పెట్టుబడులు రూ.2 లక్షల 51 కోట్లు. తద్వారా 20 లక్షల పరిశ్రమల స్థాపన జరిగింది. 17.21 లక్షల ఉద్యోగాలు వచ్చినయ్. ఇవన్నీ వట్టిగనే.. తమాషా చేస్తే అయితయా? 40,50 ఏండ్ల కాంగ్రెస్, చంద్రబాబు పరిపాలనలో 3 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉంటే.. మా తొమ్మిదిన్నర ఏండ్ల పరిపాలనలో 6.17 లక్షల ఉద్యోగులను చేర్చినం. హైదరాబాద్ ఐటీ రంగంలో మొత్తం ఉద్యోగులు 9.15 లక్షలు. సాఫ్ట్వేర్ ఎగుమతులు రూ.57,258 కోట్లు ఉంటే.. రూ.2,47,275 కోట్లకు పెరిగింది. నిబద్ధత, క్రమశిక్షణతోనే ఇవన్నీ సాధ్యం అవుతాయి. టీఎస్ఐపాస్తో పారదర్శక విధానాన్ని తీసుకొచ్చాం. పరిశ్రమలు పెరుగుతున్నయ్. టీఎస్ బీపాస్తో ఎన్నో అద్భుతాలు చేశాం.
ఇటీవలే జైన సంఘానికి జాగ ఇచ్చాం. జైన్ పెద్దాయన ఒకరు నన్ను కలిశారు. ‘సార్.. టీఎస్బీపాస్ అద్భుతంగా ఉన్నది. నాకు ఒక్కడే కొడుకు. 11 వెంచర్లు వేస్తున్నాం. ఇద్దరు కొడుకులు ఉంటే 20 వెంచర్లు వేసుకునేటోణ్ణి. అంత అవకాశం ఉన్నది హైదరాబాద్లో..’ అని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చకచకా పని పూర్తయిపోతున్నది. ప్రపంచంతో పోటీ పడే స్థాయికి హైదరాబాద్ రియల్ఎస్టేట్ ఎదుగుతున్నది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. లక్షలాది మందికి జీవన భృతి లభిస్తున్నది. 50,60,70 అంతస్థుల బిల్డింగులు నిర్మిస్తున్నారు. ముంబై తర్వాత సెకండ్ స్కైలైన్ హైదరాబాద్లో ఉన్నది. త్వరలోనే ముంబైని కూడా దాటేస్తాం. ఇవన్నీ ఉత్తగనే మాటలు చెప్తేనో.. పిట్టకథలు చెప్తేనో కాలేదు. కఠోరమైన శ్రమ, క్రమశిక్షణతో కడుపు, నోరుకట్టుకుని రాత్రింబవళ్లు పనిచేస్తే ఇదంతా జరిగింది’ అని సీఎం కేసీఆర్ వివరించారు.