హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పట్టణాలన్నీ పరిశుభ్రం కానున్నాయి. రానున్న రెండేండ్లలో డంపింగ్ యార్డులు, చెత్త నిల్వలు లేని పట్టణాలుగా మారనున్నాయి. ఇందుకోసం మున్సిపల్శాఖ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నది. దీనిలో భాగంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను 9 క్లస్టర్లుగా విభజించింది. వాటిలో రోజూ జమ అయ్యే 4,289 టన్నుల చెత్తతోపాటు ఏండ్ల తరబడి పేరుకుపోయిన చెత్త నిల్వలను క్లియర్ చేసేందుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసింది. ఈ ఏడాది జూలై నాటికి 23, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి 73, 2024 మార్చి చివరి నాటికి 27 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నది. టెండర్లు దక్కించుకొన్న సంస్థలకు టన్నుకు రూ.550 చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం మొత్తంగా రూ.178 కోట్లు వెచ్చించనున్నది. బయో మైనింగ్కు అవసరమైనంత చెత్తలేని చిన్న, కొత్త మున్సిపాలిటీల్లో ఈ ప్రాజెక్టును చేపట్టడంలేదు.
పట్టణాల నుంచి క్లియర్ చేసిన చెత్తను ఆధునిక టెక్నాలజీతో ప్రాసెసింగ్ చేసి సేంద్రియ ఎరువును, ఇతర వస్తువులను తయారు చేస్తారు. కాలిపోయే గుణం ఉండే ప్లాస్టిక్ లాంటి వ్యర్థాలను సిమెంట్ కంపెనీలకు తరలించి గ్రాన్యూల్స్, ఇటుకలను తయారు చేస్తారు. తద్వారా చెత్తను సైతం సద్వినియోగం చేసుకోవడంతోపాటు ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చేయనున్నారు.