ఏర్గట్ల, జులై 27: ఉత్తర తెలంగాణకు ఊపిరి పోసే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు తరచూ దుఃఖ సాగరమవుతున్నది. జీవనాడిగా పేరొందిన ఎస్సారెస్పీ ప్రమాదాలకు నిలయంగా మారుతున్నది. అధికారుల అలసత్వం, పర్యాటకుల నిర్లక్ష్యం ఫలితంగా ప్రాణాలు నీళ్లలో కలుస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుతో పాటు దిగువన గోదావరి, ఎగువన బ్యాక్ వాటర్లో ఎంతో మంది చనిపోతున్నా యంత్రాంగం మేల్కొనడం లేదు. భద్రతా చర్యలను పటిష్టం చేయడం లేదు. ఫలితంగా ఎస్సారెస్పీ చుట్టూ వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా నలుగురు యువకులు జల సమాధి అయ్యారు. శ్రీరాంసాగర్ పరిసర ప్రాంతాల్లో తరచూ ప్రమాదాలు పునరావృతమవుతున్నా, శాశ్వత భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ సందర్శనకు ఆదివారం వచ్చిన నలుగురు యువకులు గల్లంతైన సంగతి తెలిసిందే. నిజామాబాద్ అటోనగర్కు చెందిన కలీం(24), నజువత్ (24), అజీమ్ (24), మహారాష్ట్ర బోకర్లోని హిమాయత్నగర్కు చెందిన ఆర్హాన్(17) వరద కాలువ సమీపంలో ప్రమాదవశాత్తు నలుగురూ నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు గాలింపు చర్యలు చేపట్టగా, ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడు అజీమ్ ఆచూకీ లేకుండా పోయింది. సోమవారం ఉదయం నుంచి తీవ్రంగా గాలించగా అతడి మృతదేహం కూడా లభ్యమైంది. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
తాగు, సాగునీటి అవసరాలు తీర్చుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చుట్టూ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. జలాశయంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలను తిలకించేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ప్రాజెక్టుతో పాటు ఎగువన బ్యాక్ వాటర్ ప్రాంతం, దిగువన గోదావరి నది పరిసరాల్లో విహరిస్తుంటారు. ఈ క్రమంలో నిర్లక్ష్యం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. సెల్ఫీల కోసం పడే తాపత్రాయంలో, నీటిలో దిగాలనే ఆతృతలో కాలు జారి జల సమాధి అవుతున్నారు. ఎస్సారెస్పీ పరిసరాల్లో ఇప్పటికే చాలా మంది మృత్యువాత పడ్డారు. గతంలో అర్సపల్లికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతు కాగా, దిగువన గోదావరిలోనూ చాలా మంది మృతి చెందారు. తాజాగా నలుగురు దుర్మరణం పాలయ్యారు.