హైదరాబాద్ : తెలంగాణ విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించేందుకు ప్రత్యేక పాఠ్యాంశాలు బోధించేందుకు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించిందని టి-సాట్ సీఈవో ఆర్ శైలేష్ రెడ్డి సోమవారం పేర్కొన్నారు. ప్రతి రోజు గంట చొప్పున 20 రోజులు ఈ పాఠ్యాంశాలు ప్రసారమవుతాయని తెలిపారు. రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండే ఆంగ్ల బోధన ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించారని గుర్తు చేశారు. మార్చి 15వ తేదీ నుండి ఉదయం 11 గంటల నండి మధ్యాహ్నం 12 గంటల వరకు 20 పని రోజుల్లో ప్రత్యేక పాఠాలు ప్రసారం కానున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ పాఠ్యాంశాల బోధన జరగనున్నందున ఆ మేరకు విద్యార్థులను సమాయత్తం చేయాలని రంగారెడ్డి విద్యాశాఖ నిర్ణయించింది. పుస్తకం ఆధారంగా పాఠ్యాంశాల బోధన కాకుండా విద్యార్థులనే చిత్రాలుగా చూపిస్తూ బోధించే కొత్త పద్దతి ద్వారా అంగ్లం బోధించనున్నారని శైలేష్ రెడ్డి వివరించారు. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి పి సుశీంధ్రరావు ఆధ్వర్యంలో ఆంగ్ల బోధన నిపుణడు ఏఎస్ రెడ్డి బోధించే పాఠ్యాంశాలు మొదటి విడతలో 20 రోజుల పాటు రోజూ గంట చొప్పున వినూత్న పద్దతిలో బోధన ఉంటుందని సీఈవో తెలిపారు. విద్యార్థులతో పాటు ఉపాద్యాయులు పాఠ్యాంశాలను అనుసరిస్తే భవిష్యత్ లో మంచి ప్రయోజనాలుంటాయని సీఈవో శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు.