జనగామ : ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దేవరుప్పుల మండలంలోని కోలుకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాలకుర్తి మండలంలోని తొర్రూరు (జే) గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
తరగతుల నిర్వహణ, కొవిడ్ నియంత్రణా చర్యల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 17 మాసాల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం అయినందున ప్రత్యేక పారిశుధ్య చర్యలపై పంచాయతీ సిబ్బందికి ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సమన్వయంతో పనిచేయాలన్నారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులను ప్రతిరోజు శుభ్రపరచాలని పేర్కొన్నారు.
మంచి నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేపట్టి, పిల్లలకు శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. డెంగీ, మలేరియా వ్యాధులు దరిచేరకుండా పాఠశాలల ఆవరణలో నీరు నిల్వఉండకుండా చర్యలు తీసుకోవాలని, పిచ్చి మొక్కలు, పొదలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని మత్రి తెలిపారు.
పాఠశాలలకు వచ్చే పిల్లలు, బోధనా, బోధనేతర సిబ్బంది అంతా మాస్క్ లు ధరించాలని, సానిటైజర్, సబ్బులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పిల్లలను భౌతిక దూరం పాటించే విధంగా చూడాలని, భోజనాలు, టాయిలెట్ల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం అందించాలని ఆయన సూచించారు. పర్యటనలో మంత్రి పిల్లలతో మమేకమయ్యారు. టీచర్లు ఎలా చదువు చెప్పుతున్నది, మధ్యాహ్న భోజనం ఎలా ఉన్నది అడిగి తెలుసుకున్నారు.
బాగుగా చదువుకోవాలని, చదువుతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని మంత్రి హితబోధ చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak పాటపై పోలీసులు అభ్యంతరం
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు
ఆ నేరస్థుడిని వీఐపీలా చూడాలా ? ప్రశ్నించిన సుప్రీంకోర్టు