న్యూఢిల్లీ: 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆయనకు తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఇవాళ సుప్రీంకోర్టు నిరాకరించింది. మెడికల్ గ్రౌండ్స్పై మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. సజ్జన్ కుమార్ ఆరోగ్య నిలకడగా ఉందని కోర్టు చెప్పింది. 75 ఏళ్ల మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ ఆరోగ్యం సరిగా లేదని, గుర్గావ్లో ఉన్న మెదాంత హాస్పిటల్లో ఆయనకు చికిత్స ఇప్పించాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. ఆ సమయంలో కోర్టు సీరియస్ అయ్యింది. చాలా హేయమైన నేరాల్లో ఆయన నిందితుడని, ఆయన్ను ఓ వీఐపీలా చూడాలా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలోని రాజ్నగర్లో జరిగిన ఓ హత్య కేసులో సజ్జన్ కుమార్ జీవితకాల శిక్ష అనుభవిస్తున్నారు. అత్యంత కిరాతంగా అయిదుగుర్ని చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 2018 డిసెంబర్ నుంచి సజ్జన్ కుమార్ పది కిలోల బరువు తగ్గారని, ఆయన్ను తక్షణమే రిలీజ్ చేయాలని న్యాయవాది కోరారు. అయితే సజ్జన్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ ఆరవ తేదీ లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది.