కరీంనగర్ కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 30: తెలంగాణ బిడ్డలుగా పుట్టినందుకు గర్వపడాలని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో తారాఆర్ట్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాకారుల సంక్షేమ సంఘం సహకారంతో నిర్వహిస్తున్న కళోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళోత్సవాలను, దసరా, బతుకమ్మ సంబురాలను అట్టహాసంగా నిర్వహించడం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్కే సాధ్యమని ప్రశంసించారు. సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటేనే కళాకారులకు అడ్డా అని కీర్తించారు.
కళలను ప్రోత్సహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పారు. త్వరలో సినీ తారలతో క్రికెట్ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మూడు రోజులపాటు నిర్వహించనున్న కళోత్సవాలు శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ వై సునీల్రావు, కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ఆరు నిమిషాలపాటు సాగిన క్రాకర్షో కనువిందు చేసింది. అంతకుముందు ఒల్లాల వాణి ‘ఏ పిల్లా పిల్లాడో..’ పాటతో సీఎం కేసీఆర్ రాష్ర్టానికి చేసిన సేవలను కీర్తించగా, తెలంగాణ ఫేమ్ శివజ్యోతి (సావిత్రి) సభను ప్రారంభించారు. అనంతరం జిల్లాకు చెందిన పలువురు కళాకారులు మిట్టపల్లి సురేందర్, మధుప్రియ, మౌనికాయాదవ్, బుల్లెట్ భాస్కర్, నరేశ్, జోగుల వెంకటేశ్, శ్రీకాంత్, చంద్రవ్వ, కొమురవ్వను పరిచయం చేశారు. కార్యక్రమంలో సినీతారలు తరుణ్, శ్రీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇజ్రాయెల్, అండమాన్ నికోబార్కు చెందిన కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి.