బీర్కూర్, ఏప్రిల్ 20: దీపం పెట్టుకొని వెతికినా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్వన్గా నిలిచిందని, ప్రజల కోసం పని చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి దీవించాలని ఆయన కోరారు. అభివృద్ధిని పట్టించుకోని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పిచ్చి కూతలు మానుకోవాలని హితవు పలికారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని దామరంచ గ్రామంలో గురువారం పర్యటించిన స్పీకర్.. డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
పల్లె దవాఖాన, సహకార కేంద్రం గిడ్డంగి, హైలెవెల్ బ్రిడ్జిని ప్రారంభించడంతోపాటు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో స్పీకర్ మాట్లాడుతూ.. దీపం పెట్టుకొని వెతికినా పల్లె దవాఖానలు తెలంగాణలో తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనూ కనిపించవని చెప్పారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని నిజాంసాగర్లో కలిపి రెండు పంటలకు సాగునీరందేలా ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారని తెలిపారు. కండ్ల ముందు ఇంత అభివృద్ధి కనిపిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై అభిమానంతో మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన సందీప్బూరే, స్వరాజ్రాథోడ్, డాక్టర్ లక్ష్మీకాంత్లు ‘ఔర్ ఏక్ బార్.. కిసాన్ సర్కార్’ పేరుతో ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ పాటకు సంబంధించిన పోస్టర్ను స్పీకర్ ఆవిష్కరించి వారిని అభినందించారు.