బాన్సువాడ, మే 2: అకాల వర్షాలతో ఆగమైన అన్నదాతలకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ధాన్యం కొనుగోళ్లపైనే స్పీకర్ దృష్టిసారించారు. రాత్రికి రాత్రే కాంటాలు పెట్టించి కర్షకుల కన్నీళ్లు తుడిచారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన సభాపతిని కొందరు రైతులు కలిసి తమగోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం తడిసి పోయిందని ఆదుకోవాలని విన్నవించారు. స్పందించిన స్పీకర్.. కొనుగోళ్లపై చర్యలు చేపట్టారు. రాత్రి నుంచే ఒక్కో ప్రాంతంలో తిరుగుతూ, రైతులను కలిసి మాట్లాడారు. అధైర్యపడొద్దని, మొత్తం ధాన్యం కొంటామని భరోసా కల్పించారు. అధికారులను పిలిపించి మరీ కాంటాలు ఏర్పాటు చేయించారు. కొనుగోళ్లు చేపట్టే వరకు కదిలేది లేదని స్పీకర్ స్పష్టం చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ కాంటాలు పెట్టించారు.
సోమవారం అర్ధరాత్రి 2 గంటల వరకు స్పీకర్ నస్రుల్లాబాద్ మండలం మిర్జాపూర్, వీరాపూర్, కొల్లూర్లో పర్యటించి కాంటాలను ఏర్పాటు చేయించారు. స్పీకర్ ఆదేశాలతో రెవెన్యూ, వ్యవసాయ, సహకార, పౌరసరఫరా తదితర శాఖల అధికారులు ఆగమేఘాల మీద తరలివచ్చారు. రైస్ మిల్లర్లను పిలిపించి, కాంటా చేసిన ధాన్యం తక్షణమే తరలించాలని స్పష్టం చేశారు. కంటి మీద కునుకు లేకుండా నియోజకవర్గంలో పర్యటించిన స్పీకర్ మంగళవారం ఉదయం నుంచి మళ్లీ ధాన్యం కొనుగోళ్లపైనే ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం సభాపతి కొల్లూర్, దామరంచ, మిర్జాపూర్, వీరాపూర్, చించోలి, కిష్టాపూర్, బీర్కూర్, కోటగిరి, చందూర్లో పర్యటించారు. తాను తిరిగి వచ్చేలోగా ధాన్యం బస్తాలు ఎక్కడా కనిపించవద్దని అధికారులను ఆదేశించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేసి ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలని స్పీకర్ సూచించారు. రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెట్టకుండా కాంటా పెట్టిన ధాన్యాన్ని లారీల్లో తరలించారు.