నస్రుల్లాబాద్/బాన్సువాడ, ఆగస్టు 29 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రామాలయ ఫంక్షన్ హాలులో 513 మంది దివ్యాంగులకు పెరిగిన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను మంగళవారం స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులకు దేశంలోనే ఒక్క తెలంగాణలో అత్యధికంగా రూ.4,016 అందజేస్తున్నదని అన్నారు. అయినప్పటికీ కొందరు నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆయన మండిపడ్డారు.
కామారెడ్డి జిల్లాలో మొత్తం 18,693 మంది దివ్యాంగులకు నెలకు రూ.7.50 కోట్ల పింఛన్లు అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. మండలంలోని సుమారు 30 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం బాన్సువాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీస్టేడియంలో మేజర్ ధ్యాన్చందర్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కార్ క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.