కోటగిరి, నవంబర్ 15: ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని.. తన జీవితం ప్రజలకే అంకితమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం బర్ధిపూర్, కల్లూర్, కొడిచెర్ల, పాత పొతంగల్, కొత్త పొతంగల్, హంగర్గా, జల్లాపల్లి ఫారం, జల్లాపల్లి అబాదిలో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొందరు నాయకులు టూరిస్టుల్లా వస్తుంటారని, వారిని ప్రజలు నమ్మొద్దని సూచించారు. వేల కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని.. మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి వంటి ఎన్నో సంక్షేమ పథకాలు మ్యానిఫెస్టోలో ఉన్నట్టు చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమని జోస్యం చెప్పారు. స్పీకర్ ఆధ్వర్యంలో కల్లూర్, పొతంగల్ తదితర గ్రామాల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బర్ధిపూర్, పొతంగల్లో పలు కుల సంఘాల వారు ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతూ పత్రాలు అందజేశారు.