బాన్సువాడ: స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫ్రీడమ్ రన్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, చిన్నారులు, పోలీసులకు స్వతంత్ర భారత వజ్రోత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. పిల్లల మధ్య స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకోవడం గొప్ప అవకాశమని చెప్పారు.
నేటి తరం పిల్లలకు స్వాతంత్య్రం అంటే ఏమిటనే విషయంపై అవగాహన ఉండాలని సూచించారు. ఆంగ్లేయుల పాలనలో దేశం, ప్రజలు బానిసలుగా బతికారని, వారి నుంచి స్వేచ్ఛ కోసం మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధులు అనేకమంది పోరాటం చేసి 2 వందల ఏండ్ల పరాయి పాలన నుంచి మనకు విముక్తి కల్పించారని చెప్పారు. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలు వారి త్యాగఫలమని వెల్లడించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ ఉత్సవాలను ఈ నెల 22 వరకు ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.