హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల పక్షాన నిలబడిన నాయకురాలు స్వరాజ్యం అని స్పీకర్ గుర్తు చేశారు. నైజం గుండాలకు వ్యతిరేకంగా సాయుద పోరాటం చేసిన యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం.. హైదరాబాద్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మల్లు స్వరాజ్యం మృతిపట్ల సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతాయని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. మల్లు స్వరాజ్యానికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.