నిజామాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో సైతం ఇలాంటి పథకాలు లేవన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం వల్లవాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ..
‘బాన్సువాడ నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇంటి కలను నిజం చేయడమే నా లక్ష్యం. త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం వస్తుంది. అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేయిస్తా. దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వృద్ధులు, వికలాంగులతో పాటుగా వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాల బాధితులకు పెన్షన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే కొందమంది ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారు’ అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.