బాన్సువాడ, సెప్టెంబర్ 13 : తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్ డౌన్ ఉద్యమ కీలక మలుపు తిప్పిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం భవనాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం భవన పరిసరాల్లో టీఎన్జీవోస్ సంఘం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ మించిన నాయకుడు దేశంలో ఎవరూ లేరన్నారు.
మన రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంతోనే కేంద్రం భయపడి రాష్ర్టాన్ని ప్రకటించిందన్నారు.
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ గొప్పా.. లేక స్వాతంత్య్రం ఇచ్చిన బ్రిటీష్ వారు గొప్పా అని ప్రశ్నించారు. అదే విధంగా కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఈ రోజు రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయంటే కారణం ఉద్యోగుల సహకారమే అని తెలిపారు.
ప్రభుత్వం సాధించే విజయాల్లో ఉద్యోగుల కృషి ఎంతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. ఉద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వానికి అండగా నిలవాలని, ప్రభుత్వ రుణం తీర్చుకోవాల్సిన సమయం అసన్నమైందని అన్నారు.