వర్ని, సెప్టెంబర్ 28: సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని తండాలు అభివృద్ధి సాధించాయని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, వర్ని మండలాల్లో పర్యటించారు. వర్ని మండలం అంతాపూర్ తండా, పొట్టిగుట్ట తండాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు బాన్సువాడ పట్టణంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..గ్రంథాలయ భవన నిర్మాణ పనులను నాణ్యతో చేపట్టాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని కోరారు.
కాగా, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చే నెల 4న బాన్సువాడకు రానున్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి స్పీకర్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.