కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా బాన్సువాడ గ్రామీణ మండలం జేకే తండాలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి మొక్కలు నాటి జాతీయ జెండాలు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగారాష్ట్ర ప్రభుత్వం ‘స్వాతంత్ర్య వజ్రోత్సవాలను’ ఘనంగా నిర్వహిస్తుంద్నారు.
ఈనెల 8 నుంచి 22 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అమరులైన వారి త్యాగాలను గుర్తు చేసుకోవాలని స్పీకర్ తెలిపారు.
కులమతాలకు అతీతంగా దేశ ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలను ఉచితంగా ఇంటింటికి పంపిణీ చేస్తామన్నారు. అందరూ తప్పనిసరిగా తమ ఇంటిపై మువ్వన్నెల జెండాను ఎగురవేయాలన్నారు.